సతీ సమేతంగా యూపీకి వెళ్లిన జగన్

Update: 2020-02-17 04:45 GMT
సెలవు రోజైన ఆదివారం.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లిన వైనం బయటకు వచ్చింది. సాధారణంగా ఇతర రాష్ట్రాలకు ఎంతో అవసరం ఉంటే కానీ వెళ్లని జగన్.. తన తీరుకు భిన్నంగా సతీమణి భారతిని తీసుకొని వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన లక్నో ట్రిప్ వెనకున్న అసలు కారణం ఏమిటో తెలుసా? పీకే.

అవును.. పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ కోసమే జగన్ దంపతులు లక్నోకు వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహ ప్రచారకర్తగా పీకే టీం పని చేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్వహిస్తున్న ఐప్యాక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ వివాహ వేడుక నిన్న (ఆదివారం) లక్నోలోని హోటల్ తాజ్ మహల్ లో జరిగింది. దీనికి హాజరయ్యేందుకు జగన్ దంపతులు వెళ్లారు.

తన ఎన్నికల విజయం లో కీలక భూమిక పోషించిన పీకే టీంను ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్ ఎంత మాత్రం మర్చిపోలేదన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు. వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి జగన్.. నూతన దంపతులతో కాసేపు మాట్లాడారు.

పీకేతోనూ కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు తెలిసింది. పలు అంశాలపై ఆయన తో జగన్ చర్చించినట్లు గా సమాచారం. వేడుకకు వెళ్లిన జగన్ దంపతులు ఆదివారం అర్థరాత్రి వేళకు విజయవాడ కు చేరుకున్నారు . ఇటీవల కాలం లో సీఎం జగన్ కు.. పీకేకు మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం ఈ మధ్యన ఎక్కువ గా జరుగుతోంది. అయితే.. ఈ ఇందులో ఎలాంటి నిజం లేదని తాజా ట్రిప్ తేల్చేసిందని చెప్పాలి.
Tags:    

Similar News