పేరుకే మంత్రి పదవి.. ఉండేది ఆర్నెళ్లే..

Update: 2018-11-09 16:58 GMT
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిపోయిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరో ఆర్నెళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా ఇప్పుడు గిరిజనులు - మైనారిటీలపై ప్రేమ కురిపించేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఆర్నెళ్ల కాలానికి మంత్రులను చేయడానినకి ఇద్దరు అమాయకులను ఎంచుకున్నారు. 11వ తేదీన వారిని మంత్రులను చేసేందుకు గాను ముహూర్తం నిర్ణయించి ఇద్దరికీ కబురుపెట్టారు.  మరోవైపు ప్రస్తుత మంత్రుల్లో కొందరి శాఖలూ మారొచ్చని సమాచారం.
   
ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్ లో ప్రస్తుతం ముస్లిం మైనారిటీ, గిరిజనులకు చోటు లేదు. గతంలో ఎన్నడూ ఇలా ఈ రెండు వర్గాలు లేకుండా ఏపీ మంత్రి వర్గం లేదు. దీంతో ఎన్నికలకు ముందు ఆ రెండు వర్గాలను ఊరడించేందుకు గాను చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. క్యాబినెట్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నా కూడా ఇప్పటివరకు ఆ రెండు వర్గాలకు న్యాయం చేయని చంద్రబాబు ఇప్పుడు వారిని బుజ్జగించే పని పెట్టుకున్నారు.    
   
ఇందుకోసం ఈనెల 11న ఉదయం 11.30కు కేబినెట్ విస్తరణకు రెడీ అవుతున్నారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో చనిపోయిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడిని గిరిజన కోటాలో మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కిడారి కుమారుడు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కానప్పటికి ఆరు నెలల వెసులుబాటును ఆసరాగా చేసుకుని మంత్రిని చేయనున్నారు.
   
ఇక మైనార్టీ కోటాలో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూక్‌ ను కేబినెట్‌ లోకి తీసుకోనున్నారు. మైనార్టీ కోటాలో మంత్రులవుతామన్న ఉద్దేశంతో పార్టీ ఫిరాయించిన జలీల్‌ ఖాన్ - చాంద్‌ బాషాకు చాన్సు లేనట్లే.
   
ఈ మేరకు కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ - ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్ ఎండీ ఫరూక్‌ కు ఏపీ సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు సమాచారం. కిడారి శ్రవణ్.. వారణాసి ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం సివిల్స్‌కి శ్రవణ్ ప్రిపేర్ అవుతున్నారు.

Tags:    

Similar News