అప్పటి వరకు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు బంద్!

Update: 2020-07-03 12:10 GMT
దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యపెరుగుతూనే ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు లక్షలకి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను జులై 31 వరకు రద్దు చేస్తూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల క్రితమే జులై 15వ తేదీ వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును జులై 31వ తేదీ వరకూ పెంచుతూ ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.

అప్పటివరకూ భారత్ ‌నుంచి ఇతర దేశాలకు, విదేశాల నుంచి భారత్ ‌కు ఎలాంటి విమాన ప్రయాణాలు ఉండబోవని స్పష్టం చేసింది. అయితే వందే భారత్ మిషన్ మాత్రం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మరోవైపు దేశంలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సాధారణ రైళ్ల సర్వీసులను ఆగష్టు 12వ తేదీ వరకూ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఇంటర్నేషనల్‌ ఫ్లైట్ సర్వీసులను కూడా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అయితే, డీజీసీఏ అనుమతి పొందిన కార్గో సర్వీసులకు ఎలాంటి షరతులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో పరిస్థితిని బట్టి కొన్ని అంతర్జాతీయ సర్వీసులను నడిపే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇక డొమెస్టిక్ విమాన సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది లేదు. దేశంలో విమాన సర్వీసులు కొనసాగనున్నాయి.
Tags:    

Similar News