బండికి బ్రేకులు.. పాదయాత్ర ఇప్పట్లో లేనట్లే

Update: 2021-08-02 00:30 GMT
రాక రాక వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని ఎవరైనా చేజార్చుకుంటారా? అందులోనూ రాజకీయాల్లో అని అడిగితే నో.. అంటే నో చెప్పేస్తారు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఏ చిన్న అధిక్యత వచ్చినా.. దాన్ని చిలువలు పలువలు చేసి మైలేజీ పెంచేసి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే వైనం ఈ మధ్యన ఎక్కువైంది. అందుకు భిన్నంగా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకొని.. ఏదో అనుకున్న కార్యకర్తలకు.. ఏమీ కాదులే అన్న నిరాశను కలిగించటం తెలంగాణ బీజేపీకి మాత్రమే సాధ్యమవుతున్న విమర్శ ఇప్పుడు ఎక్కువ అవుతోంది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధిక్యత కోసం బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నా సానుకూల ఫలితం రాలేదు.

ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తే మాత్రమే గెలిచే పరిస్థితి. అందుకు భిన్నంగా సొంతంగా పోటీ చేసి అనూహ్య విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నది 2019 సార్వత్రిక ఎన్నికలతోనే. ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై సాధించిన విజయంతో రాష్ట్రంలో బీజేపీ స్థాయి మారిపోతుందని భావించారు. అందుకు భిన్నంగా.. ఎలాంటి మార్పు లేకుండా పోయింది. డాక్టర్ లక్ష్మణ్ నుంచి బండి సంజయ్ చేతికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించిన నాటి నుంచి పార్టీలో కొత్త మార్పు మొదలైంది.

పార్టీ నేతల్లోనూ.. కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. దీనికి తోడు దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రఘునందన రావు అనూహ్య గెలుపు.. రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తన అధిక్యతను స్పష్టంగా చూపించిన బీజేపీ.. గులాబీ పార్టీకి వరుస పెట్టి షాకులు ఇచ్చింది. దీంతో.. బీజేపీ ఇమేజ్ భారీగా పెరగటమే కాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి.. తెలంగాణ అధికారపక్షానికి అసలుసిసలు ప్రత్యర్థి బీజేపీనేనన్న మాట వినిపించింది.

దీనికి తోడు బండి సంజయ్ దూకుడు పార్టీకి ప్లస్ అయ్యింది. అయితే.. అందరూ అంచనాలు వేసుకున్న రీతిలో పార్టీ ఎదగలేకపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా.. పార్టీలో గ్రూపులు  దెబ్బ తీస్తున్న పరిస్థితి. ఇదే మాట ఎవరైనా అంటే.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. అందరం కలిసి కట్టుగా పని చేస్తున్నట్లు చెప్పినా.. జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు.
4

పైకి చిరునవ్వులు చిందించినా.. కడుపులో మాత్రం కత్తులు పెట్టుకున్నట్లుగా తెలంగాణ బీజేపీ నేతల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఆగస్టు 9 నుంచి తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తానని చెప్పటం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్ని కవర్ చేసేలా పాదయాత్ర ఉంటుందని చెప్పగా.. తాజాగా అలాంటిదేమీ లేదన్న మాట వినిపిస్తోంది.

పాదయాత్రకు అధినాయకత్వం ఓకే చెప్పలేదని.. దీనికి పార్టీలోని సీనియర్ నేతలు అడ్డుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎంతగా దూసుకు వెళ్లాలని బండి భావిస్తున్నా.. ఆయన జోరుకు బ్రేకులు వేస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా బండి చేపట్టాలని ప్లాన్ చేసిన పాదయాత్రకు బీజేపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం.. అదే సమయంలో లోక్ సభ సమావేశాలకు హాజరుకావాలని చెప్పిన వైనం చూస్తే.. బండి పాదయాత్రకు బ్రేకులు పడినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీని పుంజుకునేలా చేయటం కోసం బండి ఎంతలా ప్రయత్నించినా.. పార్టీ అధినాయకత్వం మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ''బండి'' జోరుకు బ్రేకులు ఆటోమేటిక్ గా పడుతున్నట్లుగా బీజేపీ వర్గాలు లోగుట్టుగా వ్యాఖ్యానిస్తున్నాయి.
Tags:    

Similar News