మంత్రి సారీ చెప్పే వరకూ క్లాస్ పీకిన సీఎం.. అలాంటోళ్లు మనకెప్పుడో?

Update: 2021-03-06 03:31 GMT
మంత్రి చెత్తపని చేశాడు. ఆ విషయాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. అప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు.. తమ మంత్రిని వెనకేసుకొస్తాయి. అడ్డగోలుగా మాట్లాడేస్తూ.. మిగిలిన అధికారపక్షం ఆయనకు అండగా ఉంటుంది. రోటీన్ గా జరిగే సీన్ ఇలానే ఉంటుంది. కానీ.. బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ దగ్గర అలాంటి పప్పులు ఉడకవ్. తాజాగా తన మంత్రివర్గంలోని మంత్రి ఒకరు చేసిన చెత్త పని గురించి అసెంబ్లీలో తెలిసింది. దీన్ని ప్రస్తావించిన విపక్షం సదరు మంత్రి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇంతకీ ఆ మంత్రి చేసిన చెత్త పనేమిటి? అందుకు సీఎం ఎలా స్పందించారన్నది చూస్తే..

బిహార్ రాష్ట్ర మంత్రుల్లో ముఖేష్ సహనీ ఒకరు. ఈ మధ్యన అతను వైశాలి జిల్లా హాజీపూర్లోని ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే.. ఆ కార్యక్రమానికి వెళ్లాల్సిన మంత్రి.. తనకు బదులుగా తన సోదరుడ్ని పంపారు. దీంతో ఆ సోదరుడు చెలరేగిపోయాడు. ఆ కార్యక్రమానికి వెళ్లి.. తానే మంత్రి అన్నట్లుగా చెలరేగిపోయాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో విపక్షం నిలదీసింది.

రోటీన్ కు భిన్నంగా స్పందించారు బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్. విపక్ష నేతలు ప్రస్తావించే వరకు తనకీ విషయం తెలీదని.. తెలుసుకొని స్పందిస్తానని చెప్పారు. ఆరా తీస్తే.. తన మంత్రి చేసిన చెత్త పని గురించిన సమాచారం బయటకు వచ్చింది. దీంతో సీరియస్ అయిన ముఖ్యమంత్రి.. సదరు మంత్రిని క్లాస్ పీకటమే కాదు.. సారీ చెప్పే వరకు ఆగ్రహం వ్యక్తం చేశారట. చివరకు మీడియా ఎదుట క్షమాపణ చెప్పాలని చెప్పటంతో చివరకు చెప్పక తప్పలేదట. ఇలాంటి ముఖ్యమంత్రులు దేశానికే కాదు.. తెలుగు రాష్ట్రాలకు అవసరం కదా? మనం అలాంటి ముఖ్యమంత్రుల్ని ఊహించగలమా?
Tags:    

Similar News