ముచ్చటగా మూడోసారి కోవిడ్.. ఆ ఎమ్మెల్యే పరిస్థితేంటి?

Update: 2022-01-16 13:07 GMT
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా సోకింది. గతంలో కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే అంబటి కరోనా బారినపడ్డారు. అప్పుడు చికిత్స పొంది కోలుకున్నారు. ఇక సెకండ్ వేవ్ సమయంలోనే బలంగా కరోనా దాడి చేసింది. అప్పుడు కూడా ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోగలిగారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి థర్డ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అంబటి మరోసారి కరోనా బారినపడ్డారు. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ మహమ్మారి బారినపడ్డారు.

ఏపీ మంత్రులు కొడాలి నాని, కృష్ణదాస్, వెల్లంపల్లి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ పి. రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. కరోనా లక్షణాల తీవ్రతను బట్టి ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. లేదంటే ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారని సమాచారం.

తాజాగా తాను కరోనా బారినపడినట్టు అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇవాళ జలుబు, ఒళ్లునొప్పులు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు చెప్పుకొచ్చారు.  పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందన్నారు. ట్రీట్ మెంట్ కు వెళుతున్నట్టు అంబటి తెలిపారు.

ఇక రెండు సార్లు కరోనా బారినపడి జయించిన వారు కూడా మూడోసారి దాని బారినపడడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సైతం మూడోసారి కరోనా బారినపడ్డాడు. ఒకసారి వస్తే రోగ నిరోధక శక్తి పెరిగి మరోసారి ఆ మహమ్మారి రాదనే ప్రచారం ఉంది. కానీ ఇలా ఒక్కొక్కరూ మూడు సార్లు కరోనా బారినపడడం వైద్య నిపుణులను కూడా షాక్ కు గురిచేస్తోంది.
Tags:    

Similar News