మాకు మోడీనే కావాలి.. 67 శాతం మంది ఆకాంక్ష‌.. స‌ర్వేలో వెల్ల‌డి

Update: 2022-05-31 14:30 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజల నమ్మకం బలంగానే ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు సమస్యలు ఉన్నప్పటికీ... మోడీ సర్కారు పాలనను 67 శాతం మంది సమర్థిస్తున్నట్లు తేలింది. మాకు మోడీనే కావాల‌ని వీరు చెబుతున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. నిజానికి దేశ‌వ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం వంటి పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీయేత‌ర రాష్ట్రాలు మోడీ విధానాల‌పై గుర్రుగా ఉన్నాయి. ఆయ‌న‌ను గ‌ద్దె దించాల‌ని భావిస్తున్నాయి.

అయితే.. అనూహ్యంగా.. ప్రజలు మాత్రం ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆయన పాలనను 67 శాతం మంది ఆమోదించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఈ ప్రజామోద రేటింగ్‌ అధికస్థాయికి చేరింది. కొవిడ్ ప్రారంభ సంవత్సరం(2020)లో ఈ రేటింగ్ 62 శాతంగా ఉండగా.. రెండో వేవ్‌ చూపిన ఉద్ధృతికి అది కాస్తా 51 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం, మూడోవేవ్ సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. ఇప్పుడా రేటింగ్ 67 శాతానికి పెరిగింది. లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 67 వేల మంది పాల్గొన్నారు.

ఇక, ఈ ఏడాది మొదటి నుంచి నిరుద్యోగం ఏడు శాతానికి దగ్గరగా ఉండటంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయిందని చెప్పారు. అయితే 37 శాతం మంది మోడీ పాలన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా నిత్యావసరాల ధరలు, జీవన వ్యయాలు తగ్గడం లేదని 73 శాతం మంది వెల్లడించడం గమనార్హం.

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నవేళ.. బీజేపీకి ఇది ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. ఇక 73 శాతం మంది తమ భవిష్యత్తుపై సానుకూలంగా ఉండగా.. 50 శాతం మంది మన దేశంలో వ్యాపారం చేయడం సులభతరంగా మారిందని చెప్పారు. మత సామరస్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తోందని 60 శాతం అభిప్రాయపడ్డారు. కాలుష్య నియంత్రణపై తగిన చర్యలు తీసుకోవడం లేదని 44 శాతం మంది పెదవి విరిచారు. ఎలా చూసుకున్నప్ప‌టికీ.. మోడీకి ప్ర‌జ‌లు మ‌రోసారి మొగ్గు చూపుతుండ‌డం కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నాయి.
Tags:    

Similar News