జీతం, ఉద్యోగ స్థానం ఆధారంగా H-1B వీసా ఎంపిక విధానం
ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులను తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.;
ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులను తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ మేరకు ఒక ప్రతిపాదనను శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యూలేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికి పంపింది. ఈ మార్పులు H-1B వీసా అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేయవచ్చు.
ప్రస్తుతం ప్రతి సంవత్సరం కాంగ్రెస్ 85,000 H-1B వీసాలను జారీ చేయడానికి చట్టబద్ధమైన పరిమితిని నిర్ణయిస్తుంది. వీటిలో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ ఉన్న వారికి రిజర్వ్ చేయబడ్డాయి. విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాలకు జారీ చేసే వీసాలకు ఎటువంటి పరిమితి లేదు.
ప్రస్తుత లాటరీ విధానంపై ప్రభావం
2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు ఇప్పటికే రావడంతో ప్రాసెస్ను నిలిపివేసినట్లు శుక్రవారం యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది. దీంతో 2026 సంవత్సరానికి H-1B లాటరీ విధానం ఉండకపోవచ్చు. ప్రస్తుతం పరిమితి ఆధారంగా లాటరీ విధానంలో వీసాదారులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత, ఆయా కంపెనీలు తమకు వచ్చిన వీసాల్లో అక్టోబరు నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తులను సమర్పిస్తాయి.
వేతనం ఆధారిత ఎంపికకు తిరిగి?
ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, లాటరీ విధానానికి బదులుగా ఆ పోస్ట్కు ఆఫర్ చేస్తున్న వేతనం ఆధారంగా వీసాలను జారీ చేశారు. కంపెనీలు మరింత మంది ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకునేలా ప్రోత్సహించడానికి ఈ విధానం అమలు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు, తక్కువ శ్రేణి జీతాలున్న పొజిషన్లలో విదేశీయుల నియామకాలను నియంత్రించడానికి ఇది ఉపయోగపడింది. అప్పట్లో "బై అమెరికన్, హైర్ అమెరికన్" అనే కార్యక్రమం కింద దీనిని నిర్వహించారు. 2021లో బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని పక్కనపెట్టారు.
తాజాగా DHS పంపిన ప్రతిపాదనపై దాదాపు 1,000 వరకు పబ్లిక్ కామెంట్లు వచ్చినట్లు బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ చేసింది. దీని వల్ల H-1B ఉద్యోగులు తక్కువగా అందుబాటులో ఉంటారని పేర్కొంది.
లాటరీ విధానంపై విమర్శలు
ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ, చాలా పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తులు చేసి, ఎక్కువ వీసాలను దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ అనే థింక్ ట్యాంక్ ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని సూచించింది. సీనియారిటీ, జీతం ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88 శాతం పెరుగుతుందని పేర్కొంది.
ఈ కొత్త ప్రతిపాదన అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇది భారతీయ ఐటీ నిపుణులు, కంపెనీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.