రష్యా కదలికలతో కలకలం.. నాటో దేశాలకూ యుద్ధ సెగ

ఉక్రెయిన్‌లో 2022లో ప్రారంభమైన యుద్ధం మూడేళ్లు దాటినా పరిష్కారం కాని స్థితిలో కొనసాగుతూనే ఉంది.;

Update: 2025-09-18 13:30 GMT

ఉక్రెయిన్‌లో 2022లో ప్రారంభమైన యుద్ధం మూడేళ్లు దాటినా పరిష్కారం కాని స్థితిలో కొనసాగుతూనే ఉంది. కానీ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు యుద్ధాన్ని ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి మలుస్తున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా డ్రోన్ దాడులు, సరిహద్దు ఉల్లంఘనలు, సంయుక్త సైనిక వ్యాయామాలు, రష్యన్ నాయకుల హెచ్చరికలు అన్నీ కలిపి నాటో దేశాల భద్రతను సవాలు చేస్తున్నాయి.

పోలండ్, రొమేనియాలో డ్రోన్ దాడులు

సెప్టెంబర్ 9–10 తేదీల్లో 19 రష్యన్ డ్రోన్‌లు పోలండ్ సరిహద్దు దాటి యుక్రెయిన్ లక్ష్యాలను దాడి చేశాయి. పోలిష్ F–16లు, డచ్ F–35లు ఆ డ్రోన్‌లను కూల్చాయి. నాటో మొదటిసారిగా రష్యన్ లక్ష్యాలపై నేరుగా ప్రతిస్పందించడం ఇదే. అలాగే సెప్టెంబర్ 13–14 తేదీల్లో రష్యన్ డ్రోన్ రొమేనియా భూభాగంలోకి ప్రవేశించింది. ఇది 2022 తర్వాత 11వసారి జరుగుతున్న ఉల్లంఘన. రొమేనియా రక్షణ దళాలు సత్వరమే స్పందించాయి.

జాపడ్–2025 వ్యాయామాలు

ఇటీవల రష్యా–బెలారస్ సంయుక్తంగా చేపట్టిన "జాపడ్–2025" సైనిక విన్యాసాలు బాల్టిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింతగా పెంచాయి. వీటిలో క్షిపణి ప్రయోగాలు, నావల్ ఆపరేషన్లు ఉన్నాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ నాటో దేశాలను లక్ష్యం చేసుకున్నవే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ కూడా “డ్రోన్ మార్గాలు ముందుగానే లెక్కలు వేసి, ఉద్దేశపూర్వకంగానే నాటో భూభాగాల మీదుగా పంపుతున్నాయి” అని ఆరోపించారు.

రష్యా వ్యూహం ఏమిటి?

రష్యా అధికారులు తమ చర్యలను “స్వరక్షణ”గా చూపుతున్నా, వాస్తవానికి ఇవన్నీ నాటోపై ఒత్తిడి పెంచడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు డిమిట్రీ మెద్వెదెవ్, “ఉక్రెయిన్‌పై నో–ఫ్లై జోన్ అమలు చేస్తే అది నాటో–రష్యా యుద్ధానికి సమానం” అని హెచ్చరించారు. మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్, “నాటో ఇప్పటికే రష్యాతో యుద్ధంలో ఉంది” అని వ్యాఖ్యానించారు.

అమెరికన్ థింక్‌ట్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ నివేదిక ప్రకారం, రష్యా తన యువతను వేగంగా మిలిటరైజ్ చేస్తూ, మరో 5 ఏళ్లలో నాటోను ఎదుర్కొనే స్థితికి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్ ఉల్లంఘనలు, సైబర్ దాడులు, జీపీఎస్ జామింగ్ అన్నీ కలిపి హైబ్రిడ్ వార్‌ఫేర్‌లో భాగమని నిపుణులు చెబుతున్నారు.

నాటో ప్రతిస్పందన

ఈ పరిణామాలపై నాటో తీవ్రంగా స్పందించింది. సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, “రష్యా చర్యలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి” అని తెలిపారు. పోలండ్ ‘ఆపరేషన్ ఈస్టర్న్ సెంట్రీ’ కింద నాటో బలగాలను మోహరించింది. జర్మనీ ప్యాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను సిద్ధంగా ఉంచింది. ఐక్య యూరోపియన్ యూనియన్ విదేశాంగ చీఫ్ కాజా కల్లాస్... “ఈ యుద్ధం ముగిసే దిశగా కాకుండా మరింత ముదిరే దిశగా సాగుతోంది” అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా నాటో, 2025లో ఉక్రెయిన్‌కు 35 బిలియన్ల డాలర్ల భద్రతా సహాయం ప్రకటించింది. ట్రైనింగ్, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఆధునిక ఆయుధాల సరఫరా తదితరాల్లో సహకారం అందించనుంది.

పూర్తి స్థాయి యుద్ధం సంభవమా??

ప్రస్తుతానికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం వైపు వెళ్లే అవకాశం తక్కువే. కానీ ‘గ్రే జోన్ వార్‌ఫేర్’ ద్వారా ఒత్తిడి పెంచడం ఖాయం. అణు బెదిరింపులు చేస్తున్నా అవి ఎక్కువగా డిటరెన్స్ కోసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే నాటోతో ప్రత్యక్ష యుద్ధం రష్యా ఆర్థిక, సైనిక బలహీనతలను బహిర్గతం చేసే అవకాశం ఉంది.

రష్యా, నాటో మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. డ్రోన్ ఉల్లంఘనలు, సైనిక విన్యాసాలు, అణు బెదిరింపులు.. ఇవి భవిష్యత్తులో యూరప్ భద్రతా సమీకరణాన్ని కుదిపివేయనున్నాయి. యుద్ధం పూర్తిగా విస్తరించకపోయినా, దాని మంటలు నాటో దేశాల దాకా చేరుతున్నాయన్నది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News