‘మౌంట్ రష్మోర్’ నమూనా... నేతల బొమ్మల పిక్స్ వైరల్!
అవును... బ్యాంకాక్ నగరంలోని సీకాన్ స్క్వేర్ షాపింగ్ మాల్ లో 'మౌంట్ రష్మోర్' తరహా భారీ నమూనా ఒకటి ఏర్పాటుచేశారు.;
అమెరికాలో ప్రముఖ నాయకుల ముఖాలను చెక్కిన 'మౌంట్ రష్మోర్' గురించి దాదాపు చాలా మందికి తెలిసిందే. ఆ కొండపై నేషనల్ మెమోరియల్ లో తన ముఖ శిల్పాన్ని చెక్కించాలని ప్రెసిడెంట్ ట్రంప్ తెగ బెమ పడిపోతున్నారు. అయితే అక్కడ కోరిక ఎప్పుడు తీరుతుందనే సంగతి కాసేపు పక్కనపెడితే.. థాయిలాండ్ లో మాత్రం ఆ తరహా కోరిక కొంత తీరిందనే చెప్పాలి!
అవును... బ్యాంకాక్ నగరంలోని సీకాన్ స్క్వేర్ షాపింగ్ మాల్ లో 'మౌంట్ రష్మోర్' తరహా భారీ నమూనా ఒకటి ఏర్పాటుచేశారు. అయితే దీనిపై అమెరికాలోని ప్రముఖ నాయకుల బొమ్మలు లేవు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలిచే నియంతలుగా పేరున్న వారి బొమ్మలు మాత్రం ఉన్నాయి. వారితో పాటు ట్రంప్ ముఖం బొమ్మ ఉండటం గమనార్హం.
ఇందులో భాగంగా... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్ పింగ్, ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ నమూనాలు ఉన్నాయి. వాటి పక్కనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బొమ్మ ఏర్పాటుచేశారు. 'సమ్ వేర్ ఎల్స్ ది సిరీస్' అనే కార్యక్రమం సందర్భంగా ఈ నమూనాను ఏర్పాటుచేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా స్పందించిన హోటల్ యాజమాన్యం.. దీనినుంచి ఎటువంటి రాజకీయ సందేశం ఇవ్వడం లేదని, కేవలం చర్చకు మాత్రమే ఆహ్వానించామని వివరణ ఇచ్చింది.
కాగా... ఇటీవల ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో 'మౌంట్ రష్మోర్'కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ఒకటి షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, రూస్ వెల్ట్, అబ్రహం లింకన్ ముఖాలు పక్కనే ట్రంప్ తాను ఉన్నట్లు చూపించారు.