బాబు 'టార్గెట్'.. తమ్ముళ్లు ఏం చేస్తారో ..!
త్వరలోనే జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.;

త్వరలోనే జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పార్టీ నిర్వహించే కార్యక్రమమే కాకుండా.. దీనిలో ప్రభుత్వ సంక్షేమం తాలూకు ఫలితం కనిపించాలన్నది ఆయన సూచన. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులకు కొన్ని లక్ష్మణ రేఖలతోపాటు.. లక్ష్యాలు కూడా నిర్దేశించారు. ప్రధానంగా జనసమీకరణ విషయాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించారు.
ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 వేల మందికి తగ్గకుండా.. జనసమీకరణ చేయాలని సూచించారు. అయితే.. ఈ ప్రకటన బాగానే ఉన్నా.. ఇంత మందిని మొబిలైజ్ చేసేందుకు వనరులు లేవని మెజారిటీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ''రమ్మంటాం వస్తారు. కానీ, వారిని తీసుకువెళ్లి.. తీసుకువచ్చేందు కు నానా తిప్పలు పడాలి. ముఖ్యంగా ఖర్చు పెట్టాలి'' అని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇక, మంత్రులు మాత్రం ఈ విషయంలో యాక్టివ్గా ఉంటున్నారు.
తమ తమ నియోజకవర్గాల్లో చంద్రబాబు పెట్టిన 2 వేల టార్గెట్ను మించి.. 3 వేల మందిని సమీకరించేం దుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి సవిత ఏకంగా 4 వేల మందిని సమీకరించి.. వెయ్యి మందిని సైకిల్ యాత్ర రూపంలో మహానాడుకు పంపిస్తున్నారు. ఇక, దెందులూరుఎమ్మెల్యే ఐదు వేల మందిని సమీకరించే పనిలో ఉన్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇలా.. కొందరు బాగానే ఉన్నా.. మరికొందరు మాత్రం మొండిఘటాలుగా మారారు.
చేతిలో రూపాయి ఖర్చు పెట్టేందుకు చాలా మంది నాయకులు వెనుకాడుతున్నారన్న చర్చ కూడా సాగు తోంది. దీంతో స్పాన్సర్లను వేడుకుంటున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా రావాలని.. తర్వాత మేలు చేస్తామని చెబుతున్నారు. అంటే.. ఒకరకంగా.. ఎమ్మెల్యేల స్పందన చిత్రంగానే ఉందని చెప్పాలి. ఇది పార్టీకి మేలు చేయకపోగా.. మరింత ఇబ్బందిగా మారుతుందన్న చర్చ సాగుతోంది. ఉదాహరణకు తిరువూరులో ఇప్పటి వరకు మినీ మహానాడు కూడా నిర్వహించలేదు. ఇక్కడ మొబిలైజేషన్ కూడా చేయడం లేదు.