సాక్షి - జగన్ పై మోడీకి ఫిర్యాదు చేశాం: టీడీపీ నేత
ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీలో జరుగుతున్న 'సాక్షి' రచ్చపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడు ఒకరు ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.;

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీలో జరుగుతున్న 'సాక్షి' రచ్చపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడు ఒకరు ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా ఏపీలో అమరావతి మహిళలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. సాక్షి కార్యాలయాల ముందు.. పెద్ద ఎత్తున నిరసన తెలిపి.. కొన్ని చోట్ల పేర్లను కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను సదరు కేంద్ర మంత్రి ఒకరు.. మోడీకి ఫిర్యాదు చేశారని పార్టీలో సీనియర్ నాయకుడు ఒకరు ఆఫ్ ది రికార్డుగా చెప్పుకొచ్చారు.
''మా మంత్రి ఒకరు.. మోడీకి చెప్పారు. సాక్షి బరితెగించి చేస్తున్న వికృత ప్రచారాన్ని వివరించారు. ఇటీవలే ప్రధాని రాజధాని కోసం శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఏం జరుగుతోందో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే.. సీఎం చంద్రబాబు కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. దీంతో మంత్రి ప్రధానిని కలిసి వివరించారు. దీనిపై కేంద్రం కూడా చర్యలు తీసుకోవా లని కోరుతున్నాం. సాక్షి లైసెన్సును రద్దు చేయాలన్నది మా డిమాండ్. మరి ఏం చేస్తారో చూడాలి'' అని సదరు నాయకుడు, మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. మోడీకి మహిళలంటే గౌరవమని.. అందునా ఆయనే స్వయంగా అమరావతిని దేవతల భూమిగా పేర్కొన్నారని.. అలాంటి చోట మహిళలను కించపరిచేలా దారుణంగా చేసిన వ్యాఖ్యలను ఆయనకు వివరించాల్సిన అవసరం తమపై ఉందన్నా రు. ఇది తప్పుకాదని కూడా చెప్పారు. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. కాగా..కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా.. వారిలో మార్పు రావట్లేదన్నారు. మహిళలను కించ పరిచే సంస్కృతికి తాము వ్యతిరేకమన్నారు.
ఇదేం జర్నలిజం.. ఇదేం వ్యాఖ్యానం అని రామ్మోహన్ నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియా తో మాట్లాడారు. దీనికి ముందు ఆయన ప్రధానిని కలిసినట్టు సమాచారం. అయితే.. ఈయనే ప్రధాని మోడీకి పిర్యాదు చేశారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సాక్షి, జగన్ వ్యవహారంపైమోడీకి సైతం విరక్తి కలగడం ఖాయమని టీడీపీ నాయకులు చెబుతున్నారు.