నాలుగో విడత : 476 మంది కోటీశ్వరులు

గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అత్యధికంగా రూ.5,705 కోట్లు.

Update: 2024-05-05 13:30 GMT

నాలుగో విడత జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 476 మంది కోటీశ్వరులు ఉన్నారని ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అత్యధికంగా రూ.5,705 కోట్లు, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4,568 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది.

24 మంది అభ్యర్థులు అఫిడవిట్‌లో ఆస్తులను ప్రకటించలేదని, 1,710 మంది అభ్యర్థుల్లో 21 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, మెుత్తం 360 అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వివరించింది. 11 మందిపై హత్య, 30 మందిపై హత్యాయత్నం, 50 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని స్పష్టంచేసింది.

ఏఏ పార్టీల అభ్యర్థులపై ఎన్నేసి కేసులు ఉన్నాయో కూడా నివేదిక తెలిపింది. ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులపై, శివసేన తరఫున బరిలో ఉన్న ఇద్దరు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. బీఅర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థుల్లో 10 మందిపై, కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న 61 మంది అభ్యర్థుల్లో 35 మందిపై, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న 70 మంది అభ్యర్థుల్లో 40 మందిపై, టీడీపీ తరఫున పోటీ చేస్తున్న 17 మందిలో తొమ్మిది మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని వెల్లడించింది. బీజేడీ అభ్యర్థుల్లో ఇద్దరు, ఆర్జేడీ అభ్యర్థుల్లో ఇద్దరు, వైసీపీ అభ్యర్థుల్లో 12 మందిపై కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News