₹90 కోట్ల సైబర్ స్కాం: దేశాన్ని కుదిపేసిన ఇంజినీరింగ్ స్టూడెంట్స్ క్యాంపస్ క్రైమ్ నెట్‌వర్క్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక భారీ సైబర్ మోసం ఉదంతాన్ని పుదుచ్చేరి సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు.;

Update: 2025-11-27 17:30 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక భారీ సైబర్ మోసం ఉదంతాన్ని పుదుచ్చేరి సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఏకంగా ఒక ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ నుంచే ఈ నేర నెట్‌వర్క్ నడుస్తోందని తేలడంతో పోలీసులు ఆ కాలేజీని "సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్"గా అభివర్ణించారు. ఈ దర్యాప్తులో సుమారు ₹90 కోట్ల విలువైన లావాదేవీల మోసం జరిగినట్టు ప్రాథమికంగా బయటపడింది.

మోసపు కళ్లెం: ₹90 కోట్లు విదేశాలకు తరలింపు

అసలు కథ దీనేష్, జయప్రతాప్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు అనుమానాస్పద లావాదేవీల కారణంగా ఫ్రీజ్ అయినప్పుడు వెలుగులోకి వచ్చింది. వారిని విచారించగా తమ ఖాతా వివరాలను స్నేహితుడు హరీష్ కు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ఒక్క లింక్ ద్వారా పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, వెలుగు చూసిన విషయాలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రధాన నిందితుడు హరీష్, ఇతరులు కలిసి దాదాపు 20కి పైగా బ్యాంకు ఖాతాలను సేకరించారు. వీటిలో ఎక్కువ శాతం ఇంజినీరింగ్ విద్యార్థులవే కావడం గమనార్హం. ఈ ఖాతాలనే సైబర్ నేరగాళ్లు మోసం ద్వారా సంపాదించిన డబ్బును ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించడానికి 'మ్యూల్ అకౌంట్స్' గా వినియోగించారు. ఇప్పటివరకు క్రైమ్ నెట్‌వర్క్ ద్వారా తరలిపోయిన మొత్తం విలువ ₹90 కోట్లుగా అంచనా వేయగా, ఇందులో ₹7 కోట్లకు పైగా నగదు ప్రవాహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ భారీ మొత్తాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సేకరించి, చివరకు దుబాయ్ , చైనాలోని అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది.

ప్రధాన నిందితులు.. నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులే!

ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఇందులో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు/గ్రాడ్యుయేట్స్ కావడం యువత భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరెస్టు చేసిన వారిలో థామస్ అలియాస్ హయగ్రీవ, హరీష్, గణేశన్, గోవిందరాజ్, యష్విన్, రాహుల్, అయ్యప్పన్ లుగా పోలీసులు నిర్ధారించారు. చైనా మాఫియాతో కీలక సంధానకర్త గణేశన్. నిందితుల్లో ఒకడైన గణేశన్, విదేశీ సైబర్ క్రిమినల్స్‌తో నేరుగా టెలిగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరిపి, నగదును చైనా మాఫియాకు పంపేందుకు కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. ప్రతి లావాదేవీపై ఇతను కమిషన్ తీసుకున్నట్టు వెల్లడైంది.

పోలీసుల భారీ స్వాధీనం

ఈ నేరానికి సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ₹5 లక్షల నగదు, 171 చెక్‌బుక్స్, 75 ATM కార్డులు, 20 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, అనేక బ్యాంకు పాస్‌బుక్స్, క్రెడిట్ కార్డులు, హ్యుందాయ్ వెర్నా కారును స్వాధీనం చేసుకున్నారు.

పౌరులకు పోలీసుల అత్యంత కీలక హెచ్చరికలు

ఈ కేసు నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు సాధారణ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నేరంలో నిందితుడిని చేయగలదు అని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మీ బ్యాంకు ఖాతా వివరాలు , ఏటీఎం, పాస్‌వర్డ్ లేదా యూపీఐ పిన్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దు. డబ్బు, కమిషన్ ఆశ చూపినా లేదా స్నేహం పేరు చెప్పినా ఎవరినీ మీ బ్యాంకు ఖాతాను ఉపయోగించుకునేలా అనుమతించొద్దు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదా షార్ట్‌కట్ మీ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కేసు, ఆధునిక కాలంలో క్యాంపస్ నుంచి అంతర్జాతీయ మాఫియా చేతికి యువత ఎలా పావుగా మారుతోందో, ఎంత పెద్ద మొత్తంలో ధనశోధన జరుగుతోందో స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News