కోటలు దాటుతున్న ఆర్మీ చీఫ్ కబుర్లు.. పాక్ పీఎం ప్రసంగం వినలేదనుకున్నారా?
పహల్గాం ఉగ్రదాడి జరగడానికి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే కారణం అనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే!;

పహల్గాం ఉగ్రదాడి జరగడానికి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే కారణం అనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే! "కశ్మీర్ జీవనాడి" అంటూ నాడు ఆయన చేసిన వ్యాఖ్యలే పహల్గాం ఉగ్రదాడిని ప్రేరేపించిందని అంటారు. అందుకే పాక్ ఆర్మీ దుస్తులు వేసుకున్న ఉగ్రవాదిగా పలువురు మునీర్ ను అభివర్ణిస్తుంటారు.
అయితే.. ఆ పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 1960 తర్వాత.. ఈ పహల్గాం ఉగ్రదాడి కారణంగా తొలిసారిగా ఆ ఒప్పందం సస్పెండ్ అయ్యింది. అనంతరం ఆపరేషన్ సిందూర్ చేపట్టి అటు 9 ఉగ్రశిబిరాలను, అటు సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది భారత్.
పాకిస్థాన్ ఎయిర్ బేస్ లపై బ్రహ్మోస్ క్షిపణులు దాడులు చేస్తుంటే పాకిస్థాన్ ఆర్మీ వణికిపోయిందని అంటారు. ఈ సమయంలో మునీర్.. కాల్పుల విరమణ విషయాన్ని తన వద్ద ప్రస్థావించారని పాక్ ప్రధాని ఇటీవల వెల్లడించారు. అలాంటి ఆర్మీ చీఫ్ మునీర్.. తాజాగా సింధూ జలాలపై కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు.
అవును... భారత్ తో యుద్ధం జరుగుతుంటే కాల్పుల విరమణకు తమ దేశ ప్రధానిని ఒప్పించి, అనంతరం తాము విజయం సాధించుకున్నామని చెబుతూ తనకు తాను ఒక ప్రమోషన్ ఇచ్చుకున్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. తాజాగా సింధూ జలాలపై మాట్లాడారు. నీరే పాకిస్థాన్ కు రెడ్ లైన్ అని, దానిపై ఎలాంటి రాజీ లేదని చెప్పుకొచ్చారు.
తాజాగా పాకిస్థాన్ లోని యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్ల సమావేశంలో ప్రసంగించిన మునీర్... నీరే పాకిస్థాన్ రెడ్ లైన్ అని, 24 కోట్ల మంది దేశ వాసుల ప్రాథమిక హక్కు అని, దానిపై ఎలాంటి రాజీకి అనుమతించమని అన్నారు. ఇదే సమయంలో.. కశ్మీర్ పై ఎలాంటి ఒప్పందాలు సాధ్యం కావని, కశ్మీర్ ను తాము ఎప్పటికీ మరిచిపోమని అన్నారు.
దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదుల విషయంలో పాక్ వైఖరి మారే వరకూ సింధూ జలాల విషయంలో భారత్ నిర్ణయం మారదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక.. పీవోకే ని దక్కించుకోవడమే భారత్ ముందున్న లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని పాక్ అడ్డుకోలేదని.. దానికోసం ఆపరేషన్ పీఓకే త్వరలో మొదలవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.