స్విగ్గీ, జొమాటో వినియోగదారులకు షాక్

స్విగ్గీ ఎంపిక చేసిన మార్కెట్లలో ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.15 (జీఎస్టీతో కలిపి)కి పెంచింది. జొమాటో రూ.12.50 (జీఎస్టీ మినహాయించి)గా వసూలు చేస్తోంది.;

Update: 2025-09-16 23:30 GMT

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీసులు ఇప్పుడు చాలా మంది రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగమయ్యాయి. మొబైల్ ఫోన్‌లో కొన్ని క్లిక్‌లతోనే ఇష్టమైన ఆహారం తలుపు ముందు అందుకునే సౌకర్యం ప్రజలకు అలవాటు అయిపోయింది. అయితే ఇకపై ఈ సౌకర్యం మరింత ఖరీదైనదిగా మారనుంది. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్‌పిన్ ఇప్పటికే తమ ప్లాట్‌ఫామ్‌ ఫీజులను పెంచగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై కూడా 18% జీఎస్టీ అమలులోకి రానుంది.

*జీఎస్టీ అమలు ఎలా?

ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే ఆహారంపై 5% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై డెలివరీ ఛార్జీలపై కూడా 18% జీఎస్టీ వర్తించబోతుంది. అంటే, వినియోగదారులు ఆహారానికి అదనంగా డెలివరీ ఛార్జీలపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం భారం నేరుగా వినియోగదారులపై పడనుంది.

*ప్లాట్‌ఫామ్‌ ఫీజులు పెరిగిన వివరాలు

స్విగ్గీ ఎంపిక చేసిన మార్కెట్లలో ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.15 (జీఎస్టీతో కలిపి)కి పెంచింది. జొమాటో రూ.12.50 (జీఎస్టీ మినహాయించి)గా వసూలు చేస్తోంది. మ్యాజిక్‌పిన్‌ ప్రతి ఆర్డరుపై రూ.10 ఫిక్స్‌డ్ ప్లాట్‌ఫామ్‌ ఫీజు అమలు చేస్తోంది. మొదట్లో కేవలం డెలివరీ ఛార్జీలే వసూలు చేసిన ఈ సంస్థలు, వినియోగదారుల సంఖ్య పెరిగిన తర్వాత అదనపు లాభాల కోసం "ప్లాట్‌ఫామ్‌ ఫీజు" అనే విభాగాన్ని ప్రవేశపెట్టాయి.

*వినియోగదారులపై పెరిగిన భారం

కొత్త జీఎస్టీతో కలిపి వినియోగదారుల ఖర్చు మరింత పెరగనుంది. జొమాటో ఆర్డర్‌లపై సగటున రూ.2 అదనంగా చెల్లించాలి. స్విగ్గీ వినియోగదారులు రూ.2.6 వరకు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఒకప్పుడు రూ.10 మాత్రమే ప్లాట్‌ఫామ్‌ ఫీజుగా చెల్లించిన వినియోగదారులు ఇప్పుడు జీఎస్టీ, ఫీజు పెంపుతో కలిపి ప్రతి ఆర్డరుపై రూ.5 నుండి రూ.7 వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. తరచూ ఆర్డర్‌ చేసే వారికి ఇది పెద్ద ఆర్థిక భారంగా మారనుంది.

*పండుగ సీజన్‌లో మరింత ఇబ్బంది

ఇప్పుడు పండుగల సీజన్‌ దగ్గరపడుతుండటంతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు భారీగా పెరగనున్నాయి. ఇలాంటి సమయంలో కంపెనీలు అమలు చేస్తున్న కొత్త ఫీజులు, అదనపు జీఎస్టీ వినియోగదారుల జేబులకు తీవ్రమైన భారమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఒంటరిగా నివసించే వారు ఎక్కువగా ఈ సర్వీసులపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఖర్చులు మరింత పెరగడం ఖాయం.

ఈ మార్పులు వినియోగదారుల జీవనశైలిపై నేరుగా ప్రభావం చూపవచ్చు. ప్రతి సారి ఆహారం ఆర్డర్ చేసేప్పుడు 10% వరకు అదనపు ఖర్చు చేయాల్సి రావడం వల్ల చాలా మంది ఆన్‌లైన్‌ డెలివరీ ఆర్డర్లను తగ్గించే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్నారు. పండుగల సందడిలో ఆహార రుచుల్లో మునిగిపోవాలని భావిస్తున్న వినియోగదారులకు ఈ ఫీజులు గట్టి ఆర్థిక పరీక్షలా మారబోతున్నాయి.

Tags:    

Similar News