ముద్రగడ లేని వైసీపీకి భారీ నష్టం !

ముద్రగడ పద్మనాభం బిగ్ ఫిగర్. ఒక సామాజిక వర్గాన్ని అందునా ఏపీలో పాతిక శాతం ఓటు బ్యాంక్ కలిగిన వర్గాన్ని తన వైపు తిప్పుకుని ప్రభుత్వాలను గడగడలాడించిన సామాజిక యోధుడు.

Update: 2026-07-15 06:46 GMT

ముద్రగడ పద్మనాభం బిగ్ ఫిగర్. ఒక సామాజిక వర్గాన్ని అందునా ఏపీలో పాతిక శాతం ఓటు బ్యాంక్ కలిగిన వర్గాన్ని తన వైపు తిప్పుకుని ప్రభుత్వాలను గడగడలాడించిన సామాజిక యోధుడు. ఆయన రాజకీయాలను సైతం ఫణంగా పెట్టి మరీ కాపుల కోసం నిలిచారు. ముద్రగడ కాపులకు ఐకాన్ అని గట్టిగా చెప్పవచ్చు. ముద్రగడ తన ఆస్తులను ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కాపుల కోసం తపన పడ్డారు. రాజకీయంగా ఆయన ఓటమి చెందవచ్చు కానీ కాపుల మనసులో ఆయన ఎప్పటికీ కొలువు ఉంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ఎంతకైనా తెగించి ముందుకు సాగడం ముద్రగడ లక్షణాలు. ఆయన నిజాయతీ, రాజీలేని ధోరణి కాపులనే కాదు అన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు.

కొండంత అండగా :

ముద్రగడ పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేశారు. అయితే ఆయన చివరి దశలో మాత్రం వైసీపీలో చేరారు. దాంతో ఆయన తమకు కొండంత అండగా ఉంటారని వైసీపీ భావించింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో వైసీపీ ఓటమి పాలు అయింది కానీ ముద్రగడ చరిష్మా మాత్రం తగ్గలేదని చెబుతారు. ఇక 2029 ఎన్నికల నాటికి ప్రతిపక్షంగా వైసీపీకి ముద్రగడ పూర్తి స్థాయిలో అండగా నిలిచి గోదావరి జిల్లాల రాజకీయం కీలక మలుపు తిప్పుతారని అంతా ఆశించారు. నిజంగా ముద్రగడ జీవించి ఉంటే అలాగే జరిగేదేమో. కాపులు ఆయన మాట వింటారు అన్నది కూడా ఉంది. కష్టానికి నష్టానికి వారికి పెద్ద దిక్కుగా ముద్రగడ ఉంటూ వచ్చారు. అయితే అలాంటి నాయకుడు ఈ రోజు దూరం కావడంతో ముద్రగడ లేని లోటు ఏమిటో గోదావరి జిల్లాలు చూస్తున్నాయి. వైసీపీ విషయం చూస్తే రాజకీయంగా భారీ నష్టం ఆ పార్టీకి అని విశ్లేషిస్తున్నారు.

సరిసాటి నేత కోసం :

వైసీపీలో ముద్రగడ సరిసాటి నేత మరొకరు ఆ సామాజిక వర్గంలో లేరు అని అంటున్నారు. ఆ సామాజిక వర్గంలో దిగ్గజ నేతలు ఎంతో మంది ఉన్నారు అయితే ముద్రగడ రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు. ఆయన అంటే కాపులకు ఉన్న గురి వేరు అని చెబుతారు. మిగిలిన నాయకులు తమ జిల్లాల వరకే పరిమితం అని అంటారు. అందుకే వైసీపీ ముద్రగడను కోల్పోవడం భారీ లోటుగానే భావిస్తోంది. జగన్ సైతం తనకు తీవ్రంగా ముద్రగడ మరణం కలచివేసింది అని చెప్పారు. ముద్రగడ జీవించి ఉంటే వైసీపీకి గోదారి జిల్లాలలో రాజకీయం నల్లేరు మీద నడకలా సాగేది అని అంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈ లోకం వీడిపోయారు. అదే ఇపుడు ఫ్యాన్ పార్టీ నేతలను అంతర్మధనంలోకి నెడుతోంది.

సరైన సమయంలోనే :

వైసీపీ ఇపుడిపుడే రీచార్జి అయి జనంలోకి వస్తోంది. మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. రెండేళ్ళలో వైసీపీ నెమ్మదిగా కోలుకుంది. ఇపుడిపుడే జనంలో మార్పు వస్తుందని గేర్ మార్చాలని చూస్తోంది. దాంతో ఏపీలో సామాజిక సమీకరణలు ప్రతీ ఎన్నికలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గోదావరి జిల్లా రాజకీయమే ఏపీలో అధికార మార్పిడికి కారణం అవుతుంది. దాంతో ఈ జిల్లాలలో వైసీపీ పూర్వ వైభవం సాధించాలని చూస్తోంది. ఈ కీలక సమయంలో ముద్రగడ అస్తమయం వైసీపీకి భారీ షాక్ అని అంటున్నారు. ముద్రగడ చేసే విమర్శలకు ఆయన ప్రభుత్వానికి సంధించే లేఖలకు ఎంతో విలువ ఉంటుంది. ముద్రగడ నిజాయతీ ఆయన నిబద్ధత కారణంగా విశ్వసనీయత ఎక్కువ. అలాంటి నేత వల్ల వైసీపీకి రాజకీయంగా మేలు జరిగేదని అంతా అంటున్నారు. కానీ ముద్రగడ జీవన ప్రస్థానం ముగించడంతో వైసీపీకి గోదావరి జిల్లాలలో ఇపుడు దిక్కు తోచని స్థితి ఏర్పడింది అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఆల్టర్నేషన్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో.

Tags:    

Similar News