ఒక రోజు 3 షాకులు.. ప్రచారంలో షర్మిలను నిలదీసిన అప్పులోళ్లు!

పెండ్లిమర్రి బెనీటమైన్స్ బాధితులు ఆమె ప్రచారాన్ని అడ్డుకోవటంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యారు

Update: 2024-05-09 04:52 GMT

ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఘాటు విమర్శలు.. పంచ్ డైలాగులతో ఫైర్ బ్రాండ్ గా మారిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు అనూహ్య రీతిలో ఒకే రోజున మూడు షాకులు తగిలాయి. ఎన్నికల ప్రచార వేళ.. ఈ తరహాలో రోజులో మూడు షాకులు మరెవరికి చోటు చేసుకోలేదని చెబుతున్నారు. మంగళవారం వైఎస్సార్ కడప జిల్లాలో ప్రచారం చేస్తున్న ఆమె వాహనాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. తమ వాహనాలకు ఇవ్వాల్సిన రూ.6 లక్షల అద్దె చెల్లించలేదంటూ నిలదీశారు. దీంతో.. ఆమె షాక్ కు గురయ్యారు. వారికి సర్ది చెప్పి వెళ్లిపోయారు.

పెండ్లిమర్రి బెనీటమైన్స్ బాధితులు ఆమె ప్రచారాన్ని అడ్డుకోవటంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తనకు బెనీటమైన్స్ కు సంబంధం లేదని.. ఆ ఉదంతంలో డబ్బులకు సంబంధించిన అంశాలతో లింకు లేదన్న ఆమె.. ప్రచారాన్ని అడ్డుకున్న వారికి సరైన రీతిలో సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. కోర్టులో ఆమెకు.. ఆమె సోదరి డాక్టర్ సునీతకు మరో షాక్ తగిలింది.

ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావించకూడదంటూ కడప కోర్టు జారీ చేసిన ఆర్డర్ ను డిస్మిస్ చేయాలంటూ సునీత దాఖలు చేసుకున్న పిటిషన్ ను తాజాగా కొట్టేసింది. వైఎస్ వివేకా హత్య కేసును ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదంటూ కడప జిల్లా కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సవాలు చేస్తూ ఏపీ హైకోర్టును వీరిద్దరూ ఆశ్రయించారు.

Read more!

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ అంశాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో షర్మిల.. ఆమె సోదరి డాక్టర్ సునీతలు ఇద్దరు మరోసారి కడప కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అంతేకాదు.. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారని పేర్కొంటూ షర్మిల.. సునీతలకు రూ.10వేల ఫైన్ కట్టాలని ఆదేశించింది. ఈ జరిమానాను కడప జిల్లా లీగల్ సెల్ కు కట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News