శ్రీకాకుళం పాలిటిక్స్: పలకరింపులు.. పనులు కూడా...!
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే గోండు శంకర్.. తల్లోనాలుకగా అల్లుకుపోతున్నారు.;
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే గోండు శంకర్.. తల్లోనాలుకగా అల్లుకుపోతున్నారు. సమస్య మీది-పరిష్కారం మాది! అంటూ.. ఆయన నినాదాలు కూడా ఇస్తున్నారు. కేవలం పలకరింపులకే ఆయన పరిమితం కావడం లేదు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, కూటమి నాయకులతో కలివిడి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరినీ కలుపుకొని పోతున్నారు.
వాస్తవానికి శ్రీకాకుళం టీడీపీకి కంచుకోట. గతంలో వరుస విజయాలు ఈ పార్టీని వరించాయి. తర్వాత.. ధర్మాన ప్రసాదరావు.. గెలిచినా.. ఆయన పట్టు నిలబెట్టుకోలేక పోయారు. ఇక్కడి ప్రజల నాడిని కూడా ఆయన పెద్దగా టచ్ చేయలేక పోయారు. సొంత వ్యాపారాలు, ఆస్తులు పెంచుకున్నారన్న వాదన ఉండనే ఉంది. ఇది.. ధర్మాన ఫ్యామిలీకి మైనస్ అయింది. దీనిని గమనించిన టీడీపీ నేతలు.. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది కలిసి వచ్చింది.
తొలిసారి విజయం దక్కించుకున్నప్పటికీ.. గోండు శంకర్.. నియోజకవర్గంలో అందరికి అండగా ఉంటు న్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రతి సోమవారం నేరుగా కలెక్టరేట్కు వెళ్లి.. తన నియోజకవర్గం నుంచి వచ్చే పిటిషన్ల పై దృష్టి పెడుతున్నారు. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. ఎక్కడ కుదిరితే అక్కడ పలకరింపులకు ఎలాంటి జంకులేకుండా ముందుకు సాగుతున్నారు. చిన్న పెద్ద, బీద బిక్కీ అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తున్నారు. కలుపుగోలుగా వ్యవహరిస్తున్నారు.
ఇది గోండు శంకర్కు కలిసి వచ్చిన అవకాశం. మరోవైపు.. వైసీపీ తరఫున ధర్మాన ప్రసాదరావు ఉన్నప్ప టికీ.. ఆయన జాడ పెద్దగా కనిపించడం లేదు. ఇంకా సమయం ఉందంటూ.. ఆయన పార్టీ కార్యకర్తలకు దూరంగానే ఉంటుందన్నారు. దీంతో ఇతర నియోజకవర్గాల్లో ఉన్న విధంగా ఇక్కడ ప్రత్యర్థుల నుంచి బలమైన పోరాటం కానీ.. విమర్శలు కానీ.. లేకపోవడం కూడా గోండుకు కలిసి వస్తున్న అంశాలే. మొత్తంగా కొత్తనేతే అయినా.. కలివిడిలోనే కాకుండా.. పనులు చేయించడంలోనూ ఆయన ముందంజలోనే ఉన్నారని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.