మోదీ ఒక్క మాటతో గోల్డ్ మార్కెట్ కుప్పకూలిందా..?

బంగారం మార్కెట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి చూస్తే సామాన్యుడికి నిజంగానే మైండ్ బ్లాక్ అవుతోంది.

Update: 2026-05-16 19:30 GMT

బంగారం మార్కెట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి చూస్తే సామాన్యుడికి నిజంగానే మైండ్ బ్లాక్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా రికార్డు స్థాయిలో పరుగులు తీసిన పసిడి ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పడిపోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ఈ ధరల పతనానికి సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్‌కు ఒక ఆసక్తికరమైన లింక్ కుదిరింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన “ఒక సంవత్సరం పాటు ఎవరూ బంగారం కొనొద్దు” అనే వ్యాఖ్య ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఆ వ్యాఖ్య వచ్చిన కొద్ది రోజులకే గోల్డ్‌, సిల్వర్ ధరలు వరుసగా క్షీణించడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. “మోదీ మాటను మార్కెట్ చాలా సీరియస్‌గా తీసుకుంది బాస్!” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు దాదాపు ₹3,000 వరకు పడిపోగా వెండి ధర ఏకంగా ₹17,000 వరకు క్షీణించడం మార్కెట్‌లో పెద్ద సంచలనంగా మారింది. దీంతో “ అరేయ్ ఆగు భయ్యా.. మరీ ఇంతలా పడిపోకు! ’’ అని మోదీగారే స్వయంగా అనుకుంటున్నారేమో అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు, ట్రోల్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

ట్రంప్ వల్ల కానిది.. మోదీ వల్ల అయిందా?

ఇక ఈ చర్చలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ప్రపంచ మార్కెట్లను, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను శాసించే పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు, గ్లోబల్ లీడర్స్ కూడా చేయలేని పనిని మోదీ ఒక్క వ్యాఖ్యతో చేసేశారని నెటిజన్లు సరదాగా విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా తెరపైకి వచ్చింది. “ట్రంప్ తన నిర్ణయాలతో మార్కెట్లను కుదిపేయాలని చూశారు కానీ కాలేదు.. మోదీ మాత్రం ఒక్క మాటతో బంగారం గ్రాఫ్‌ను కిందకు దించేశారు” అంటూ ట్విట్టర్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో జోకులు పేలుతున్నాయి.

తెరవెనుక అసలు కారణాలు ఇవే!

సామాన్య ప్రజలకు ఈ టైమింగ్ మొత్తం మోదీ వ్యాఖ్యలతో కలిసొచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి గోల్డ్ ధరలు ఇంతలా పడిపోవడానికి అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు నుంచి డాలర్ వైపు మొగ్గు చూపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై తీసుకుంటున్న నిర్ణయాలు, మార్కెట్ అంచనాలను తలకిందులు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కాస్త సద్దుమణగడంతో, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఒత్తిడి తగ్గింది. గరిష్ట ధరల వద్ద ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు పాల్పడటం కూడా ధరల పతనానికి దారితీసింది.

బంగారం ఇంకా పడుతుందా? మళ్లీ పెరుగుతుందా?

ఇప్పుడు సామాన్యుడి మదిలో ఉన్న అసలు ప్రశ్న ఒక్కటే… బంగారం ఇంకా పడిపోతుందా? లేక మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. స్వల్పకాలంలో ధరల్లో ఇటువంటి ఒడిదుడుకులు మరికొంత కాలం కొనసాగవచ్చు. అయితే దీర్ఘకాలంలో గోల్డ్‌కు డిమాండ్ ఎప్పుడూ తగ్గదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే పెళ్లిళ్ల సీజన్, పండుగలు రావడం లేదా అంతర్జాతీయంగా మళ్లీ ఏవైనా ఆర్థిక అనిశ్చితులు తలెత్తితే బంగారం ధరలు మళ్లీ రాకెట్ లాగా పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి కొనుగోలుదారులకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు.

"సార్.. పెట్రోల్ ధరలపై కూడా ఒక స్టేట్‌మెంట్ ఇవ్వండి!" నెటిజన్ల నెక్స్ట్ డిమాండ్

ఈ గోల్డ్ మార్కెట్ పతనాన్ని చూసి ఫుల్ జోష్‌లో ఉన్న నెటిజన్లు ఇప్పుడు ప్రధాని మోదీ ముందు మరో క్రేజీ డిమాండ్ పెడుతున్నారు. “మోదీ గారు.. ప్లీజ్, ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరల గురించి కూడా ‘ఎవరూ వాడొద్దు’ అని ఇలాంటి స్టేట్‌మెంట్ ఒకటి ఇచ్చేయండి సార్! ఆ తర్వాత దేశవ్యాప్తంగా మీకు గుళ్ళు కడతాం!” అంటూ ఫన్నీ కామెంట్లతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం దేశంలో గోల్డ్ మార్కెట్ రేట్ల కంటే, సోషల్ మీడియాలో వస్తున్న ఈ మీమ్స్‌కే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు!




Tags:    

Similar News