ఆత్మరక్షణలో పార్టీలు.. యువతే కీలకం..!
జాతీయ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. కేంద్ర మంత్రిని రాజీనామా చేయించే పరిస్థితి వచ్చింది.
జాతీయ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. కేంద్ర మంత్రిని రాజీనామా చేయించే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాల దరిమిలా.. యువతకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పదన్న భావన అన్ని పార్టీల్లోనూ వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతోపాటు.. యువతకు చేరువ కావాలన్న వ్యూహాలను పార్టీలు అనుసరిస్తున్నాయి. ఏపీ విషయానికి వచ్చినా.. ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ, జనసేన కూడా భావిస్తున్నాయి. ఇక వైసీపీ లోనూ జన్జీ మంత్రం వినిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే.. కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాకపోయినా.. అది నడపించిన ఉద్యమంలో యువత ప్రధాన పాత్ర పోషించారు. కేవలం సోషల్ మీడియా వేదికగానే ఏకమయ్యారు. ప్రభుత్వాన్ని కదిలించారు. నిజానికి ప్రతిపక్షాలు చేయాల్సిన పనిని యువత చేశారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
రేపు ఇదే యువత ఏపీలోనూ మార్పు దిశగా అడుగులు వేసే అవకాశం ఉందన్న అంచనాలు వస్తున్నాయి . ఈ నేపథ్యంలో యువత సెంట్రిక్గానే ఇప్పుడు రాజకీయాలు చేయాలన్న భావన పార్టీల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ను చంద్రబాబు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పూర్తిగా ఆయనకే అప్పగించారు. పార్టీ కార్యకర్తల విషయా న్ని కూడా ఆయనకే ఇచ్చేశారు. తద్వారా యువతను ఆకర్షించేందుకు.. లోకేష్కు అవకాశం ఏర్పడింది.
ఇక, జనసేనలో పార్టీ అధినేత యువతను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. దీనిని ఓటు బ్యాంకుగా ఆయన మార్చుకునే ప్రయత్నం చేయాలి. వైసీపీ విషయానికి వస్తే.. జగన్ తనను తాను యూత్గా చెప్పుకొంటున్నారు. దీనికి తోడు వ్యక్తిగత ఇమేజ్ను యూత్ను ఆకర్షించేందుకు వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ ప్రయత్నాలు సరిపోతాయా? లేక మార్పుల దిశగా అడుగులు వేయాలా? అనేది పార్టీల్లో జరుగుతున్న అంతర్మథనం. యువతకు ఎక్కువగా టికెట్లు ఇవ్వడం.. వారిని పార్టీ కార్యక్రమాల బాధ్యతలు పంచుకునేలా చేయడం ఇప్పుడు తక్షణ అవసరంగా పార్టీలు గుర్తిస్తున్నాయి. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపడతాయో చూడాలి.