ధర్మాన సోదరులు.. వైసీపీలో కలకలం.. !
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరులు.. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారా? వైసీపీలో కలకలం సృష్టిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.;
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరులు.. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారా? వైసీపీలో కలకలం సృష్టిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే.. వాస్తవానికి వారేమీ బహిరంగ ప్రకటనలు కానీ.. పార్టీపై విమర్శలు కానీ చేయడం లేదు. చేస్తున్నట్టుగా ఎలాంటి సంకేతాలు కూడా రావడం లేదు. అయినా.. ధర్మాన సోదరుల చుట్టూ అనేక విమర్శలు ముసురుకున్నాయి.
ఈ విషయాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. నేరుగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు ఫిర్యాదు చేశా రు. వారిని పిలిచి మాట్లాడాల్సిందేనని.. ఆయన పట్టుబట్టారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు జగన్ పక్కనే ఉన్న దువ్వాడ.. శ్రీకాకుళం రాజకీయాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ధర్మాన సోదరులను నిలువరించాలని.. వారి దూకుడు కారణంగా పార్టీ దెబ్బతింటోందని ఆయన చెప్పినట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. దీంతో జగన్ సైతం.. తాను పిలిచి మాట్లాడతానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే అసలు ధర్మాన సోదరులు ఏం చేస్తున్నారన్నది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పార్టీలో ఐక్యతకు గండి కొడుతున్నారన్నది ప్రధాన విమర్శగా ఉంది. పైకి మౌనంగానే ఉన్నా.. అంతర్గతంగా నాయకులకు వారు చెక్ పెడుతున్నారన్నది దువ్వాడ చెబుతున్న మాట. దీనికి ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన అంటున్నారు. ముఖ్యంగా కృష్ణదాస్పై మరింతగా దువ్వాడ ఆరోపణ లు గుప్పించినట్టు తెలిసింది.
పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా.. సోదరులు ఇద్దరూ అడ్డుపడుతున్నారని.. ఎవరినీ ముందుకు సాగనివ్వడం లేదని కూడా వారిపై చెబుతున్నారు. ఇక, ప్రయివేటు సెటిల్ మెంట్లు చేస్తున్నా రని.. ధర్మాన ప్రసాదరావుపైనా ఆయన ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను పార్టీకి దూరంగా ఉండాల్సి వస్తోందని వెల్లడించారని వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ధర్మాన సోదరుల విషయంపై జగన్ దృష్టిపెట్టాలని దువ్వాడ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఇది నిజమేనా? అనేది ప్రశ్న. చివరకు ఏం చేస్తారో చూడాలి.