కుప్పంలో బాబు మకాం.. రీజనేంటి ..!
తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు వరుసగా మూడు రోజుల పాటు మకాం వేశారు.;
తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు వరుసగా మూడు రోజుల పాటు మకాం వేశారు. అయితే.. నిజానికి ఆయన గతంలో ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు. ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా.. ఒక్క రోజు కు మించి.. ఇక్కడ మకాం వేయలేదు. మహా అయితే.. రెండో రోజు మధ్యాహ్నానికే కుప్పంనుంచి రిటర్న్ అయ్యారు. కానీ, ఈ దఫా.. ముందు నాలుగు రోజుల పర్యటన పెట్టుకున్నారు. కానీ.. తర్వాత.. దానిని మూడు రోజులకు కుదించారు.
ప్రస్తుతం మూడో రోజుల పాటు సీఎం చంద్రబాబు కుప్పంలోనే ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గిరిజన సంప్రదాయ ఉత్పత్తులతో కూడిన ఎగ్జిబిషన్ను కూడా ఆయన ప్రారంభించారు. అదేవిధం గా డ్వాక్రా మహిళలకు.. 5555 ఈ-సైకిళ్లను కూడా పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. అయితే.. ఇవి పైకి కనిపిస్తున్న పరిణామాలు. కానీ, అంతర్గతంగా మరిన్ని కారణాలు ఉన్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
1) కుప్పంలో మరిన్ని ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర మంలో భూసమీకరణ లేదా.. సేకరణ అంశాలపై ఆయన దృష్టి పెట్టారు. వాస్తవానికి దీనిని అధికారు లకు అప్పగిస్తే వారే చేస్తారు. కానీ, సొంత నియోజకవర్గం కావడంతో తానే స్వయంగా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆ మేరకు తానే స్వయంగా పరిశీలన చేస్తున్నారు. ఇది ప్రధాన విషయమని అంటున్నారు.
2) పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఇంకా తనదైన శైలిలో విభజన రాజకీయాలకు తెరదీసింది. దీంతో పార్టీ శ్రేణుల్లో చీలికలు కనిపిస్తున్నాయి. దీనిని సరిచే సేందుకు కూడా చంద్రబాబు వరుసగా కుప్పంలోనే మకాం వేశారన్న చర్చ సాగుతోంది. అంతేకాదు.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి.. వచ్చే ఎన్నికల నాటికి కుప్పాన్ని రాష్ట్రంలోనే నెంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నం జరుగుతోంది. అందుకే చంద్రబాబు.. కుప్పంలో మూడు రోజుల పర్యటనను పెట్టుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.