బీజేపీకి బాధ్యత గుర్తు చేయాలా.. ?
ఇక, తాజాగా జనసేన-బీజేపీల విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఈ సమయంలో కూడా బీజేపీ మౌనంగా ఉండిపోయింది.
కూటమి మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఎప్పటికప్పుడు.. బాధ్యతలు గుర్తు చేయాల్సి రావడం ప్రభుత్వ పెద్దలకు ఒకింత ఇబ్బందిగానే ఉంది. అయినా.. సర్దుకుపోతున్నారు. కానీ.. కీలక సమయాల్లో.. కీలక విషయాలపై జరుగుతున్న రాజకీయ వివాదాలపై కూడా బీజేపీ రాష్ట్ర నేతలు.. మౌనంగా ఉంటున్నారు. పోనీ.. వీరికి రాజకీయాలపై అనుభవం లేదా? అంటే.. ఉంది. పోనీ.. వీరేమైనా ఢిల్లీలో చక్రం తిప్పుతూ తీరిక లేకుండా ఉన్నారా? అంటే.. అది కూడా లేదు.
అయినప్పటికీ.. బీజేపీ ఏపీ నాయకులు ఒక్క విషయంలో కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి కూటమిలో ఉన్నప్పుడు.. అన్నింటినీ.. అన్ని విషయాల్లోనూ కలుపుగోలు తనంతో ముందుకు సాగాలి. కానీ.. ఆ తరహా ప్రయత్నాలు బీజేపీ నాయకులకు తెలియడం లేదా? తెలిసీ.. కావాలనే మౌనంగా ఉంటున్నారా? అనేది ప్రశ్న. తిరుమల లడ్డూ వివాదం తెరమీదికి వచ్చి.. అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు.. ఫ్లెక్సీ వివాదాలు వచ్చి.. అంబటి రాంబాబు నేరు చేసుకున్నప్పుడు.. కూడా బీజేపీ నాయకులు పన్నెత్తు మాట అనలేదు.
ఇక, తాజాగా జనసేన-బీజేపీల విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఈ సమయంలో కూడా బీజేపీ మౌనంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనను ఏమైనా అన్నా సర్దుకుపోతానని.. కానీ, కేంద్ర మంత్రి అమిత్షాపై విమర్శలు చేసినా బీజేపీ నాయకులు పట్టించుకోకపోవడం తనకు బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ చెప్పారు. అయినా.. బీజేపీ నాయకుల నుంచి ఆశించినట్టుగా స్పందన కలగలేదు.
సోము వీర్రాజు మీడియా ముందు మాట్టాడినా.. అసందర్భ వ్యాఖ్యలు చేసి.. చేతులు కాల్చుకున్నట్టుగా అయింది. నాగేశ్వర్ను నక్సలైట్లతోనూ.. తీవ్ర వాదులతోనూ పోల్చి మరో వివాదానికి దారి తీశారు. ఇలా.. ఏ విషయంలోనూ బీజేపీ నాయకుల నుంచి సరైన విధంగా రాజకీయ జోక్యం ఉండడం లేదన్నది వాస్తవం. ఇక, సంక్షేమ పథకాలు, పెట్టుబడుల విషయంపైనా.. ప్రచారం చేద్దామని చెప్పినా.. బీజేపీ నాయకుల్లో చలనం లేకుండా పోయిందని.. అంతర్గత సమావేశాల్లో చర్చ వస్తున్నా.. వారు స్పందించడం లేదు. మరి ఇలా అయితే.. ఎలా? అన్నది కమల నాథులు ఆలోచించుకోవాలి.