బండి భగీరథ్ కేసులో హైకోర్టులో భారీ ట్విస్ట్
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు విచారణలో గురువారం అత్యంత ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు విచారణలో గురువారం అత్యంత ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందస్తు బెయిల్ కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కేసు మూలాలను ప్రభావితం చేసే కీలక అంశాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా బాధితురాలి వయస్సు నిర్ధారణ విషయంలో నెలకొన్న సందిగ్ధత ఈ కేసును సరికొత్త మలుపు తిప్పింది.
వయస్సుపై న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు
భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసులు పేర్కొన్న బాధితురాలి వయస్సుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితురాలికి సంబంధించిన వివిధ ధ్రువపత్రాల్లో పుట్టిన తేదీలు భిన్నంగా ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల రికార్డుల్లో ఒక తేదీ ఉంటే.. ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో మరో తేదీ ఉందని పేర్కొన్నారు. అసలు బాధితురాలు మైనర్ కాదని.. ఆమె మేజర్ అని తేలితే ఈ కేసులో 'పోక్సో' చట్టం వర్తించదని ఆయన వాదించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో కనీస ప్రమాణాలు పాటించలేదని.. కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే హడావుడిగా సెక్షన్లు నమోదు చేశారని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
హైకోర్టు సీరియస్.. పోలీసులకు డెడ్ లైన్
ఉభయ పక్షాల వాదనలు విన్న గౌరవ హైకోర్టు.. బాధితురాలి వయస్సు నిర్ధారణ అనేది ఈ కేసులో అత్యంత కీలకమైన అంశమని అభిప్రాయపడింది. వయస్సు విషయంలో స్పష్టత లేనప్పుడు చట్టపరమైన ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి సంబంధించిన మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్, ఎస్సెస్సీ మెమో, ఆధార్ కార్డు వంటి అన్ని అధికారిక పత్రాలను తక్షణమే పునఃపరిశీలించాలని ఆదేశించింది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసి ఖచ్చితమైన వయస్సుతో కూడిన నివేదికను శుక్రవారం నాటికి కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.
రేపే భవితవ్యం తేలనున్న బెయిల్ పిటిషన్
మరోవైపు బండి భగీరథ్కు ముందస్తు లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశంపై హైకోర్టు తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. పోలీసుల సమర్పించే వయస్సు నిర్ధారణ నివేదిక ఆధారంగానే బెయిల్ మంజూరుపై కోర్టు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బాధితురాలు మేజర్ అని తేలితే.. పోక్సో సెక్షన్లు తొలగించాల్సి ఉంటుంది.. అప్పుడు బెయిల్ లభించడం సులభతరం కావచ్చు. అయితే ఆమె మైనర్ అని రికార్డులు ధ్రువీకరిస్తే మాత్రం కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
ఈ కేసు కేవలం న్యాయపరమైన అంశంగానే కాకుండా రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది. భగీరథ్ తరఫు వర్గాలు ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఏది ఏమైనా రేపు హైకోర్టు వెల్లడించబోయే తీర్పు , పోలీసుల నివేదికపైనే ఇప్పుడు అందరి కళ్లు నెలకొన్నాయి. ఈ కేసులో వెలుగు చూస్తున్న ప్రతి మలుపు అటు న్యాయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.