మతం పేరుతో మర్మం.. ల్యాండ్ గ్రాబింగ్ కోణంలో విస్తుపోయే నిజాలు!

ఒక పురాతన కట్టడం కూలిపోతే దానికి 'ప్రకృతి వైపరీత్యం' అనే ముసుగు వేయడం చాలా తేలిక. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నారోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన హిందూ ఆలయం ఇటీవల కూల్చివేతకు గురైంది.

Update: 2026-09-03 04:50 GMT

ఒక పురాతన కట్టడం కూలిపోతే దానికి 'ప్రకృతి వైపరీత్యం' అనే ముసుగు వేయడం చాలా తేలిక. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నారోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన హిందూ ఆలయం ఇటీవల కూల్చివేతకు గురైంది. భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయిందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ ఘటన వెనుక కేవలం మతోన్మాదం మాత్రమే ఉందా లేక భూ ఆక్రమణ కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

మతం ఒక నెపం.. భూమి మాత్రమే అసలు లక్ష్యం:

స్థానిక మైనారిటీల కథనం ప్రకారం, ఆలయ భూమిని ఆక్రమించడానికే ఈ కూల్చివేత జరిగింది. పాకిస్థాన్‌లో ఉన్న పురాతన దేవాలయాలకు వేల ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. మైనారిటీల జనాభా తగ్గడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ భూములు సంరక్షణ లేకుండా మిగిలిపోతున్నాయి. ఇక ఇక్కడే స్థానిక రియల్ ఎస్టేట్ మాఫియా, రాజకీయ శక్తులు చేతులు కలుపుతున్నాయి. ముందుగా ఆలయాన్ని శిథిలావస్థకు చేరిందని చెప్పడం, ఆ తర్వాత వర్షాలకు కూలిపోయిందని సాకు చూపి ఆ కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించడం అక్కడ ఒక సీక్రెట్ ప్లాన్‌గా మారింది.

సంరక్షకులే భక్షకులయితే?:

పాకిస్థాన్‌లో మైనారిటీల ఆస్తులను కాపాడటానికి 'ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు' (ETPB) అనే ప్రభుత్వ సంస్థ ఉంది. కానీ ఈ సంస్థపైనే అనేక భూ ఆక్రమణ ఆరోపణలు వస్తున్నాయి. ఇక చారిత్రక కట్టడాలు కూలిపోయేంత వరకు వాటికి మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహించడం, ఆ తర్వాత అవి కూలగానే ప్రకృతి వైపరీత్యం అని బిల్డర్లకు ఆ స్థలాలను కట్టబెట్టడం నిత్యకృత్యంగా మారింది. 100 ఏళ్ల నాటి నిర్మాణానికి కనీస భద్రత కల్పించకపోవడం ప్రణాళికాబద్ధంగా చేసిన విధ్వంసమేనని స్పష్టమవుతోంది.

అంతర్జాతీయ ఒత్తిడి ఎందుకు అవసరం?:

ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ కేవలం విచారణే కాదు, ఆలయాన్ని తిరిగి నిర్మించాలని డిమాండ్ చేసింది. పారదర్శక విచారణ జరిగితే తప్ప వర్షం అనే ముసుగు వెనుక దాక్కున్న రియల్ ఎస్టేట్ మాఫియా పాత్ర బయటకు రాదు. ఇక ఒకవేళ ఈ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించి తిరిగి ఆలయాన్ని నిర్మిస్తేనే, భష్యత్తులో మిగిలిన చారిత్రక ఆస్తులపై కన్నువేసే ఆక్రమణదారులకు భయం ఏర్పడుతుంది.

పాకిస్థాన్‌లో శతాబ్దాల నాటి ఆలయాలు ఒక్కొక్కటిగా కనుమరుగవ్వడం వెనుక కేవలం మతాంధత మాత్రమే లేదు, అది మతం పేరుతో సాగుతున్న ఒక పక్కా వ్యాపారం. "వర్షం వల్ల కూలిపోయింది" అనే ప్రకటనల వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ కుట్రలను అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంస్థలు గుర్తించాల్సి ఉంది. ఇక సంస్కృతిని కాపాడటం అంటే కేవలం గోడలను నిలబెట్టడం కాదు, ఆ గోడల వెనుక ఉన్న భూములను ఆక్రమణదారుల రాబందుల నుండి కాపాడటమే నిజమైన రక్షణ అని గ్రహించాలి.

Tags:    

Similar News