బ్రిట‌న్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌తో భార‌త్ FDC ఒప్పందం

మ‌హేష్ న‌టించిన 1-నేనొక్క‌డినే (2014) మెజారిటీ భాగం యూకే- లండ‌న్ లో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-10-09 15:55 GMT

మ‌హేష్ న‌టించిన 1-నేనొక్క‌డినే (2014) మెజారిటీ భాగం యూకే- లండ‌న్ లో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అక్క‌డ రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో 14 రీల్స్ బృందం స్నేహం, స‌త్సంబంధాలు ఆస‌క్తిని క‌లిగించాయి. యూకేలో సినిమాని తెర‌కెక్కిస్తే, అక్కడ చిత్రీక‌ర‌ణ ముగిసిన అనంత‌రం ప‌న్నును రాయితీ రూపంలో వెన‌క్కి తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, త‌ద్వారా నిర్మాత‌కు చాలా మేలు జ‌రుగుతుంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. భార‌తీయ సినిమాని ప్రోత్స‌హించ‌డం ద్వారా యూకే టూరిజానికి ఆద‌ర‌ణ మ‌రింత పెరిగే వెసులుబాటు ఉంటుంది గ‌నుక ఇలాంటి ఆప్ష‌న్ ఉంది.

అమెరికాతో సంబంధాలు అనూహ్య‌మైన మ‌లుపులు తిరుగుతున్న ఈ స‌మ‌యంలో యూకే దేశ రాజ‌కీయ నాయ‌కులు భార‌త్ తో స‌త్సంబంధాల కోసం ప్ర‌య‌త్నించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అయితే ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశం ఇలా భారత్ తో సంబంధాల కోసం య‌త్నించ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

ఇప్పుడు భార‌త్ తో సాంస్కృతిక - క‌ళాత్మ‌క రంగాల్లో వ్యాపార‌ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ - భారతదేశ జాతీయ చలనచిత్ర అభివృద్ధి కమిషన్ మధ్య కొత్త అవగాహన ఒప్పందం (ఎంవోయు) ప్రాసెస్ కూడా జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ఈ ఒప్పందం ఇరు దేశాల మ‌ధ్య సినిమాలు, సాంస్కృతిక ప‌రమైన సంబంధాల‌ను బ‌లోపేతం చేయాల‌ని యూకే ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇరు దేశాల్లో సినిమాల నిర్మాణాన్ని స‌ర‌ళ‌త‌రం చేయ‌డానికి ఇలాంటి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

యూకేలో సినిమాలు తీయ‌డం భార‌తీయ ఫిలింమేక‌ర్స్ కి కొత్తేమీ కాదు. హిస్ట‌రీలో చాలా సినిమాల‌ను యూకేలో తెర‌కెక్కించారు. దేశానికి తొలి ఆస్కార్ ని అందించిన `స్లమ్‌డాగ్ మిలియనీర్` యూకేలో తెర‌కెక్కింది. య‌ష్ రాజ్ ఫిలింస్ దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే కొంత పార్ట్ యూకేలో, పాట‌లు స్విట్జ‌ర్లాండ్ లో తెర‌కెక్కాయి. ఇక విదేశీ సినిమాల చిత్రీక‌ర‌ణ‌ల ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు దాదాపు 300 మిలియన్ పౌండ్ల ఆదాయం (12 మిలియన్ల పౌండ్ల బడ్జెట్‌తో తీసే సినిమాల‌తో) జ‌న‌రేట్ అవుతోంది. ఇరు దేశాల క్రాస్-కల్చరల్ స్టోరీ టెల్లింగ్ కి కూడా ఇది ఆస్కారం క‌లిగిస్తోంది. య‌ష్ రాజ్ ఫిలింస్ దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత తిరిగి యూకేలో మూడు సినిమాల‌ను నిర్మించేందుకు భారీ డీల్ కుదుర్చుకుంది.

వ‌ర‌ల్డ్ క్లాస్ కంటెంట్ సృష్టిని బెట‌ర్‌మెంట్ చేయ‌డానికి భారతదేశం - బ్రిట‌న్ సంయుక్త స‌హ‌కారం కోసం ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈరోజు YRF స్టూడియోస్‌లో యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌కు ఆతిథ్యం ఇవ్వడం మాకు గౌరవాన్ని పెంచింద‌ని సంస్థ ప్ర‌క‌టించింది.

Tags:    

Similar News