టాలీవుడ్ డైరెక్టర్ల కొత్త ప్రయోగాలు!
దర్శకుల దృక్పథంలో వస్తున్న మార్పు టాలీవుడ్ సినిమాల నాణ్యతను పెంచడమే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా చేస్తోంది.
టాలీవుడ్ నవతరం దర్శకులతో కళకళలాడుతోంది. ఎన్నడు లేని విధంగా సరికొత్త ప్రయోగాలు ఊపందుకున్నాయ. వాటిలో కొన్ని సక్సెస్ అయినా? మరికొన్ని ఫెయిలైనా? ప్రయోగాలు మాత్రం ఆగడం లేదు. అందులోనూ వైఫల్యంలో ఉన్న దర్శకులైతే మరింత కసిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తాము నమ్మిన రొటీన్ ఫార్ములాలను పక్కనబెట్టి ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు కమర్షియల్ హంగులకే ప్రాధాన్యత ఇచ్చిన వారు ఇప్పుడు కంటెంట్ను ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నారు. దర్శకుల దృక్పథంలో వస్తున్న మార్పు టాలీవుడ్ సినిమాల నాణ్యతను పెంచడమే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా చేస్తోంది.
దర్శకుడు శివ నిర్వాణ తన శైలిని పూర్తిగా మార్చేసారు. రవితేజతో ఓ పవర్ ఫుల్ డివోషనల్ బ్యాక్డ్రాప్ కథ `ఇరుముడి`ని తెరకెక్కిస్తున్నారు. భక్తిరసంతో సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో రవితే జలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. కమర్షియల్ అంశాలకు సరికొత్త పాయింట్ జోడించి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే శివ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది.
అలాగే వైవిధ్యమైన కథలకు చిరునామా మేర్లపాక గాంధీ ఈసారి వరుణ్ తేజ్తో కలిసి హారర్ కామెడీ జానర్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు హారర్ - కామెడీ అనే రెండు భిన్నమైన జానర్లను కలపడం కత్తి మీద సాము. అయినా గాంధీ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూనే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ హీరోల మార్కెట్కు సరిపోయేలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథాంశంతో వస్తున్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విభిన్న కథాంశాలకు మారుపేరుగా నిలిచిన సంకల్ప్ రెడ్డి.. గోపీచంద్తో చేస్తున్న `భారతవర్ష` చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పీరియాడిక్ డ్రామా నేపథ్యంతో అసాధారణమైన సాంకేతిక విలువలతో రూపొందుతోంది. గతంలో సీ బ్యాక్ డ్రాప్ లో ఘాజీ... అంతరిక్షం నేపథ్యంలో `అంతరిక్షం` వంటి ప్రయోగాలు చేసిన సంకల్ప్ రెడ్డి లోతైన కథాంశంతో గోపీచంద్ను కొత్త గెటప్లో ప్రెజెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కేవలం కొత్త కథలే కాకుండా ఫ్రాంచైజీల వైపు కూడా యువ దర్శకులు మొగ్గు చూపుతున్నారు. కల్ట్ క్లాసిక్ `ఈ నగరానికి ఏమైంది`తో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం అందించిన ఫ్రెష్ ఫీల్ను, సీక్వెల్లో మరింత మెచ్యూర్డ్ హ్యూమర్తో అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మల్టీ-పార్ట్ సినిమా సంస్కృతిని తెలుగులో బలోపేతం చేయడంతో పాటు పాత అభిమానులకు ఓ తీపి జ్ఞాపకాన్ని మరోసారి అందించనున్నాయి.
యువ దర్శకులు బాక్సాఫీస్ విజయాల కోసం మాత్రమే కాకుండా ప్రేక్షకుడికి మంచి అనుభవాన్ని ఇచ్చే కథల కోసం శ్రమిస్తున్నారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మారుతున్న వ్యూహాలు, పరిశ్రమకు కొత్త ఊపిరినిస్తున్నాయి. విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా కథలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో యువ దర్శకులు చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తే మరిన్ని మంచి ప్రయోగాలకు అవకాశం ఉంటుంది.