ఆ స్టార్ హీరోతో క్లాసిక్ డైరెక్టర్ మాసా? క్లాసా?
భాయ్జాన్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం బుధవారం ముంబైలో ఘనంగా ప్రారంభమైంది.;
భాయ్జాన్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం బుధవారం ముంబైలో ఘనంగా ప్రారంభమైంది. ముంబైలోని ప్రత్యేకమైన లొకేషన్లో పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఈ క్రేజీ కాంబో గురించి గత కొంత కాలంగా జరుగుతోన్న ప్రచారం నేటితో అధికారకమైంది. సినిమా అధికారికంగా రూపం దాల్చడంతో రెండు పరిశ్రమల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయన తార కథానాయికగా నటిస్తుండటం విశేషం. ముంబైలో జరిగిన లాంచ్ వేడుకలో సల్మాన్ ఖాన్తో పాటు నయనతార కూడా పాల్గొన్నారు.
`జవాన్` చిత్రంతో బాలీవుడ్లో నయనతార ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఆ విజయంతో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఎందరో స్టార్లు అమ్మడితో కలిసి పని చేయాలని ఆశపడ్డారు. కానీ ఆ ఛాన్స్ అందరికీ కాదు. కొందరికే అన్నట్లు షారుక్ తర్వాత సల్మాన్ ఖానే కే అవకాశం కల్పించింది. దీంతో సల్మాన్-నయన్ కాంబినేషన్ నెట్టింట క్రేజీగా మారింది. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో వీరిద్దరూ షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ జంట వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో?; చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముంబైలో ఏర్పాటు చేసిన ఓ భారీ ఇంటి సెట్లో తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాజుగారికిది బాలీవుడ్లో మైలురాయి లాంటి ప్రాజెక్ట్. వంశీ పైడిపల్లి - దిల్ రాజుల మధ్య ఉన్న విజయవంతమైన అనుబంధం గురించి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సక్సెస్ పుల్ చిత్రాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టాయి. అదే నమ్మకంతో రాజుగారు మరోసారి వంశీ తో ముందుకెళ్తున్నారు. ఇద్దరు సల్మాన్ ఖాన్ను ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
వంశీ పైడిపల్లి తన సినిమాల్లో ఎమోషన్స్ , మాస్ ఎలిమెంట్స్ను సరి సమానంగా మేళవించడంలో దిట్ట. సల్మాన్ ఖాన్ ఇమేజ్కు తగినట్లుగా ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. `మహర్షి`, `వారసుడు` వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన వంశీ హిందీ మార్కెట్ విషయంలో కొత్త స్ట్రాటజీతో వెళ్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు `దిల్, దిమాగ్, జిగర్ సే` అనే నినాదంతో మేకర్స్ ప్రమోషన్లు ప్రారంభించారు. షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ముంబైలో నెల రోజుల పాటు సుదీర్ఘమైన షెడ్యూల్ను ప్లాన్ చేశారు. ఇందులో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉంది.