బాలీవుడ్ లో ఆ సినిమా సీక్రెట్ చేప్పేసిన సాయిపల్లవి!
`ఏక్ దిన్` చిత్రంతో సాయి పల్లవి బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరససన నటించింది.;
`ఏక్ దిన్` చిత్రంతో సాయి పల్లవి బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరససన నటించింది. ఇటీవలే రిలీజ్ అయిన సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. సాయి పల్లవి పాత్రకు మాత్రం గుర్తింపు దక్కింది. నటన పరంగా అమ్మడు పాసై పోయింది. అయితే ఈ సినిమాతోనే సాయి పల్లవి బాలీవుడ్ లో లాంచ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అనే కొంత డిస్కషన్ కూడా జరుగుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా సాయిపల్లవి అందుకు గల కారణాన్ని రివీల్ చేసింది. `ఏక్ దిన్` కథ విన్న వెంటనే ఆమెకు హాలీవుడ్ క్లాసిక్ చిత్రం `బిఫోర్ సన్రైజ్` గుర్తొచ్చింది.
ఒకే రోజులో సాగే కథ ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు, వారి భావోద్వేగాల చుట్టూ తిరిగే ఆ హాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. `ఏక్ దిన్` స్క్రిప్ట్లో కూడా అదే తరహా స్వచ్ఛత, గాఢత ఉండటంతో సాయి పల్లవి మరో ఆలోచన లేకుండా ప్రాజెక్టును ఓకే చేసినట్లు తెలిపింది. సాధారణంగా బాలీవుడ్ అరంగేట్రం అంటే? హీరోయిన్లు భారీ కమర్షియల్ హంగులు, గ్లామర్ ఉన్న సినిమాలను ఎంచుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రనే ఎంచుకుంది.
`నేను ఎప్పుడూ కథలోని లోతును, నా పాత్ర ఇచ్చే సంతృప్తిని మాత్రమే చూస్తాను. బిఫోర్ సన్రైజ్ లాంటి క్లాసిక్ వైబ్ని ఈ కథలో చూసినప్పుడు ఒక నటిగా నాలోని ఆసక్తిని అది రేకెత్తించింది` అని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఆమెలోని కళాత్మక దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పింది. ఈ సినిమాలో సాయి పల్లవి సాధారణ అమ్మాయిగా, ఎంతో సహజంగా కనిపిస్తుంది. కేవలం మాటలు, చూపులతోనే హావభావాలను పలికించాల్సిన పాత్ర ఇది. హాలీవుడ్ సినిమాల్లో ఉండే ఆ నెమ్మదైన కథనం, పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీని ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు అందించొచ్చని అమ్మడు బలంగా నమ్మింది.
సాయి పల్లవి నటనలోని సహజత్వం పాత్రకు మరింత ప్రాణం పోసిందని, జునైద్ ఖాన్తో ఆమె కెమిస్ట్రీ కూడా ఎంతో హుందాగా ఉందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ప్రాంతీయ భాషా నటిగా ఉండి హిందీలో తొలి ప్రయత్నంలోనే ఇలాంటి ప్రయోగాత్మక కథను ఎంచుకోవడం సాహసమే అని చెప్పాలి. కానీ సాయి పల్లవికి ఉన్న నేచురల్ స్టార్ ఇమేజ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా కలిసొచ్చింది. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆమెలోని ప్రతిభను గుర్తించి ఆదరిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ `రామాయణ్` లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సీత పాత్రలో నటించనుంది. ఈ సినిమా విజయం తర్వాత సాయి పల్లవి స్టార్ డమ్ బాలీవుడ్ లో ఆకాశాన్నే అంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.