తప్పులమీద తప్పులు చేస్తున్న మాస్ రాజా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ మాస్ హీరోగా ఎదిగిన రవితేజ ఒక దశలో వరుస సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆయనతో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే టాక్ ఉండేది. దీంతో తను హీరోగా సినిమాలు చేయాలని ప్రొడ్యూసర్లు పోటీలుపడేవారు. అయితే ఇప్పడు సీన్ మారింది. వరుసగా అప్పట్లో సక్సెస్లు సాధించినట్టుగా రవితేజ హిట్ సినిమాలని అందించలేకపోతున్నాడు.
రొటిన్ సినిమాలు చేస్తున్నాడని, ఒకే మూస థోరణి యాక్టింగ్ అంటూ కామెంట్లు రావడంతో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. అలా అని `ఈగల్` లాంటి భారీ యాక్షన్ డ్రామా చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కారణం ఆయా కథల్లో బలం లేకపోవడం, వాటిని తెరకెక్కిచిన డైరెక్టర్లు ఆయా సినిమాలని అనుకున్న స్థాయిలో తెరపై ఆవిష్కరించలేకపోవడం. ఫలితంగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్లుగా నిలిచి రవితేజకు షాక్ ఇచ్చాయి.
హిట్ రీమేక్తో `మిస్టర్ బచ్చన్`, మాస్ మసాలా యాక్షన్ డ్రామాతో `మాస్ జాతర` చేసినా నో యూజ్. వీటిల్లో కూడా బలమైన కథ లేకపోవడం వల్లే ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వరుస ఫ్లాపుల తరువాత జోనర్, స్టైల్ మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అని అన్నా ఎవరూ పట్టించుకోలేదు. భారీ అంచనాల మధ్య కిషోర్ తిరుమల రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్నే అందించి షాక్ ఇచ్చింది. వరుసగా ఫ్లాపులు ఎదురవుతుండటంతో రవితేజ అభిమానుల్లో చర్చ మొదలైంది.
తమ హీరో వరుస తప్పులు చేస్తున్నాడని వాపోతున్నారు. వెంకీ అట్లూరి `సార్`ని, మల్లిడి వశిష్ట `బింబిసార`ని రిజెక్ట్ చేసి హిట్లని వదులుకున్నాడని, రీసెంట్గా `మ్యాడ్` డైరెక్టర్ చెప్పిన సూపర్ స్టోరీని కూడా రిజెక్ట్ చేశాడని వాపోతున్నారట. ఇదే స్టోరీని రీసెంట్గా హీరో కార్తి ఓకే చేయడం, దాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించడానికి రెడీ అవుతుండటం తెలిసిందే. ఇప్పటికైనా తనని వెతుక్కుంటూ వచ్చే సక్సెస్ స్టోరీస్ని రిజెక్ట్ చేయకుంటే సక్సెస్లు అవే వస్తాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ `ఇరుముడి` మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. స్పిరిట్చువల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.