మాస్ రాజా సినిమా అక్క‌డ క‌నిపించ‌దే!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు గ‌త కొన్నాళ్లుగా స‌రైన విజ‌యాలు లేవు. క్రేజీ క‌థ‌ల‌తో డైరెక్ట‌ర్లు వ‌స్తున్నా అవేవీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి.;

Update: 2026-02-19 17:55 GMT

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు గ‌త కొన్నాళ్లుగా స‌రైన విజ‌యాలు లేవు. క్రేజీ క‌థ‌ల‌తో డైరెక్ట‌ర్లు వ‌స్తున్నా అవేవీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. ర‌వితేజ హిట్టు మాట విని మూడేళ్ల‌కు పైనే అవుతోంది. త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ట్ చేసిన యాక్ష‌న్ కామెడీ `ధ‌మాకా`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని ఫ‌స్ట్ టైమ్ వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిన మాస్ రాజా అప్ప‌టి నుంచి నిరాశ‌ప‌రుస్తూనే ఉన్నాడు. సుర్జిత్ ముఖ‌ర్జీ డైరెక్ట్ చేసిన బెంగాలీ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `విన్సి డా` ఆధారంగా చేసిన `రావ‌ణాసుర‌`తో ఆక‌ట్టుకుంటాడ‌నుకుంటే షాక్ ఇచ్చాడు.

అభిన‌వ రాబిన్ హుడ్‌గా జ‌నాల జేజేలు అందుకున్న బందిపోటు దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు లైఫ్ స్టోరీ ఆధారంగా తీసిన సినిమా `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` ఎలాంటి ఇంపాక్ట్‌ని క‌లిగించ‌లేక‌పోయింది. ఇక యంగ్ డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని డైరెక్ష‌న్‌లో చేసిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఈగ‌ల్‌`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేస్తాడ‌ని భావిస్తే అర్థంప‌ర్థం లేని సినిమాగా మారి ఫ్లాప్‌గా నిలిచింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా సాగే బాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ `రైడ్‌` ఆధారంగా చేసిన `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌` అస‌లు రేసులోనే లేకుండా పోయింది.

కొత్త డైరెక్ట‌ర్ భాను భోగ‌వ‌ర‌పుకు అవ‌కాశం ఇస్తూ చేసిన యాక్ష‌న్ కామెడీ `మాస్ జాత‌ర‌` ఎలా వ‌చ్చిందో అలాగే తెలియ‌కుండానే థియేట‌ర్ల‌లో నుంచి వెళ్లిపోయి అభిమానుల‌కు, సినీ ల‌వ‌ర్స్‌కు షాక్ ఇచ్చింది. భార అంచ‌నాలు పెట్టుకుని భారీ స్థాయిలో నిర్మించిన ప్రొడ్యూస‌ర్‌కు అదే స్థాయిలో న‌ష్టాల‌ని తెచ్చి పెట్టింది. ఇలా వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వుతుండ‌టంతో త‌న పంథాకు భిన్నంగా ప్ర‌య‌త్నించాల‌ని ర‌వితేజ చేసిన ఫ్యామిలీ డ్రామా `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి`.

కిషోర్ తిరుమ‌ల మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత చేసిన ఈ మూవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. రిలీజ్‌కు ముందు ఎంత హ‌డావిడి చేసినా ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌ల బ‌ల‌మైన కంటెంట్ లేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేసింది. సంక్రాంతి విడుద‌లై నెల‌పైనే కావ‌స్తున్నా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇదే సినిమాతో పాటు సంక్రాంతి బ‌రిలో నిలిచిన చిరు `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు`, శ‌ర్వానంద్ `నారీ నారీ న‌డుమ మురారీ`, న‌వీన్ పొలిశెట్టి `అన‌గ‌న‌గ ఒక రాజు`, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ `ది రాజాసాబ్‌` ఓటీటీల్లోకి వ‌చ్చేశాయి.

కానీ ఇంత వ‌ర‌కు మాస్ మ‌హారాజా - కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌తో రూపొందిన ఫ్యామిలీ డ్రామా `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` మాత్రం ఎందుకు ఓటీటీలోకి రావ‌డం లేదు? అనే చ‌ర్చ నెట్టింట జ‌రుగుతోంది. సంక్రాంతి రేసులో నిలిచిని సినిమాలు మొత్తం ఓటీటీలోకి వచ్చేసినా ఇంత వ‌ర‌కు ర‌వితేజ సినిమా స్ట్రీమింగ్ కాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటీ? ఎందుకు ఆల‌స్యం అవుతోంది? అని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    

Similar News