స్టార్ హీరో సారీ చెప్పాల్సిందే.. కోర్టు నుంచి ఆదేశాలు
రిషబ్ శెట్టి సృష్టించిన జానపద కళాఖండం `కాంతార` సినిమాలోని పవిత్రమైన వరాహ రూపం, ఆచారబద్ధమైన నటనను అనుకరిస్తూ అపహాస్యం చేశారనే ఆరోపణలపై బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు.;
రిషబ్ శెట్టి సృష్టించిన జానపద కళాఖండం `కాంతార` సినిమాలోని పవిత్రమైన వరాహ రూపం, ఆచారబద్ధమైన నటనను అనుకరిస్తూ అపహాస్యం చేశారనే ఆరోపణలపై బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఒక ప్రైవేట్ వేడుకలో రణ్వీర్ చేసిన మిమిక్రీ ప్రదర్శనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కర్ణాటకకు చెందిన ఒక సాంస్కృతిక సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. రణ్వీర్ సింగ్కు వివరణ కోరుతూ తాజాగా తాఖీదులు (నోటీసులు) జారీ చేసింది. రణ్ వీర్ స్వయంగా క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆర్డర్ జారీ చేసింది. అంతేకాదు గతంలో రణ్ వీర్ హృదయపూర్వకంగా సారీ చెప్పలేదని కూడా వ్యాఖ్యానించింది కోర్టు. ఇది ఇప్పుడు సినీ, న్యాయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
దక్షిణ కర్ణాటక ప్రాంతంలో అత్యంత పవిత్రంగా భావించే `భూత కోల` సంప్రదాయాన్ని రణ్వీర్ సింగ్ తన మిమిక్రీ ద్వారా తక్కువ చేసి చూపారని పిటిషనర్ కోర్టులో వాదించారు. కాంతార కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. అది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి.. ఆ ప్రాంతపు ఆచారాలకు ప్రతీక అని వారు పేర్కొన్నారు. కేవలం వినోదం కోసం లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం దైవ సమానమైన నృత్య రీతులను వెక్కిరించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ పిటిషన్ను పరిశీలించిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కళాత్మక స్వేచ్ఛ అనేది ఇతర ప్రాంతాల సంస్కృతులను, మతపరమైన భావాలను కించపరిచేలా ఉండకూడదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. రణ్వీర్ సింగ్ వంటి ప్రజాదరణ కలిగిన నటులు పబ్లిక్ ఫిగర్స్గా బాధ్యతాయుతంగా ఉండాలని.. ప్రాంతీయ ఆచారాలను గౌరవించడం రాజ్యాంగబద్ధమైన కనీస బాధ్యత అని కోర్టు గుర్తు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మిమిక్రీ వీడియోలను తక్షణమే అన్ని ప్లాట్ఫామ్ల నుండి తొలగించాలని కూడా పిటిషన్లో డిమాండ్ చేశారు.
రణ్వీర్ సింగ్ తరపు న్యాయవాదులు ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. అది కేవలం సినిమాలోని ఒక సీన్ను సరదాగా అనుకరించడమే తప్ప.. ఎవరినీ లేదా ఏ సంప్రదాయాన్ని అవమానించే ఉద్దేశ్యం లేదని వాదించే ప్రయత్నం చేశారు. అయితే భూత కోల అనేది కేవలం నృత్యం కాదని.. అది ఒక పవిత్రమైన ప్రక్రియ అని స్థానికులు బలంగా వాదిస్తున్నారు. రణ్వీర్ తన చర్యకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలని కూడా ఫిర్యాదుదారులు కోర్టును విన్నవించారు.
ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయడమే కాకుండా.. ప్రాంతీయ సంస్కృతుల పట్ల బాలీవుడ్ వైఖరిని మరోసారి ప్రశ్నించేలా చేసింది. రణ్వీర్ సింగ్ నుండి వివరణ వచ్చిన తర్వాత తదుపరి విచారణను కొనసాగిస్తామని హైకోర్టు వెల్లడించింది. ఈ కేసు ఫలితం భవిష్యత్తులో నటులు, సెలబ్రిటీలు ఇతర ప్రాంతాల ఆచార వ్యవహారాలతో హాస్యం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే ఒక ఉదాహరణగా నిలవనుంది. రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్ 2 సంచలన విజయాన్ని ఆస్వాధిస్తూ తదుపరి ప్రణాళికల్లో బిజీగా ఉన్నారు.