అందాల రాశిఖ‌న్నా కొత్త గేమ్ ప్లాన్ అదుర్స్‌!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి ల‌క్కు ఎప్పుడు ఎలా క‌ల‌సి వ‌స్తుందో..ఎవ‌రి అదృష్టం ఎలాంటి మ‌లుపులు తిప్పుతుందో చెప్ప‌డం క‌ష్టం.;

Update: 2026-03-13 07:30 GMT

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి ల‌క్కు ఎప్పుడు ఎలా క‌ల‌సి వ‌స్తుందో..ఎవ‌రి అదృష్టం ఎలాంటి మ‌లుపులు తిప్పుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఎంత టాలెంట్ ఉన్నా ఇక్క‌డ కాలం క‌లిసి రాక‌, అదృష్టం లేక‌పోతే క‌ష్ట‌మే. ఆవ‌గింజంత అదృష్టం ఉన్నా అంద‌మెక్కే రోజులివి. అదే లేక టాలెంట్‌ని న‌మ్ముకుని ఇప్ప‌టికీ స‌క్సెస్ కోసం ఏళ్ల‌త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్న వాళ్లెంద‌రో..ఆ జాబితాలో ఉన్న హీరోయిన్ రాశిఖ‌న్నా. స్టార్ హీరోయిన్ కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నా ఇప్ప‌టికీ ఆ జాబితాలో చేర‌లేక‌పోతోంది. హీరోయిన్‌గా స్టార్ అనిపించుకోవ‌డం కోసం యుద్దం చేస్తూనే ఉంది.

2014లో `ఊహ‌లు గుస‌గుస‌లాడే` సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యమైన ఈ ఢిల్లీ సోయ‌గం సినిమాల్లోకి యాక్సిడెంట‌ల్‌గానే ఎంట్రీ ఇచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ కావాల‌న్న క‌ల‌తో ఢిల్లీ లేడీ శ్రీ‌రామ్ కాలేజీలో చేరిన రాశిఖ‌న్నా అనుకోకుండా యాడ్ పిల్మ్స్‌ల‌లో న‌టిస్తూ బాలీవుడ్ మూవీ `మ‌ద్రాస్‌కేఫ్‌`తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగులో `ఊహ‌లు గుస‌గుస‌లాడే`తో ప‌రిచ‌య‌మై తొలి సినిమాతోనే హిట్‌ని సొంతం చేసుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించింది. 22 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఏడంటే ఏడే స‌క్సెస్‌ల‌ని సాధించింది.

కానీ స్టార్ డ‌మ్‌ని, స్టార్ హీరోల సినిమాల్లో న‌టించే అవ‌కాశాల్ని సొంతం చేసుకోలేక ఇప్ప‌టికీ రేసులో వెన‌క‌బ‌డే ఉంది. నాగ‌శౌర్య టు మాస్ మ‌హారాజా ర‌వితేజ వంటి టైర్ టు హీరోల సినిమాల్లో న‌టించిందే కానీ స్టార్స్‌, సూప‌ర్ స్టార్స్ తో క‌లిసి న‌టించే అవ‌కాశాన్ని మాత్రం ద‌క్కించుకోలేక‌పోతోంది. ఇన్నాళ్లుకు రాశిఖ‌న్నా ఫేట్ మారే టైమ్ వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. త‌న కెరీర్‌ని ఎన‌లైజ్ చేసుకున్న రాశిఖ‌న్నా తాజాగా కొత్త గేమ్ ప్లాన్‌ని రెడీ చేసుకుని అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమాల‌ని ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి ఏళ్లు గ‌డుస్తున్నా భారీ స్టార్ల‌తో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకోలేక రేసులో వెన‌క‌బ‌డిపోయింది. అయితే ఇప్పుడు `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`లో చేస్తున్న రాశి త‌న గేమ్ ప్లాన్‌ని మార్చుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న `ఉస్తాద్ గ‌బ్బ‌ర్ సింగ్‌` మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో శ్రీ‌లీల‌తో క‌లిసి రాశిఖ‌న్నా న‌టించింది. ఈ మూవీతో మంచి బ్రేక్ ల‌భిస్తుంద‌ని భావిస్తున్న రాశీ ప్ర‌స్తుతం బ‌న్నీ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీని టార్గెట్‌గా పెట్టుకుని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా త‌మిళ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుడుతున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ స్థాయిలో నిర్మించ‌నున్న ఈ మూవీలో న‌టించ‌డం కోసం రాశీఖ‌న్నా ఇటీవ‌లే డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌ని క‌లిసింద‌ట‌. ఇందులోని ఓ ముఖ్య‌మైన రోల్ కోసం రాశిఖ‌న్నాని అనుకుంటున్నార‌ట‌. తాజాగా క‌లిసిన రాశిఖ‌న్నా ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో ఈ ప్రాజెక్ట్ గురించి చ‌ర్చించిన‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలిసింది. అదే జ‌రిగితే రాశిఖ‌న్నా కెరీర్ బిగ్ ట‌ర్న్ తీసుకున్నట్టే.

Tags:    

Similar News