బాహుబలి రచయితతో పూరి జగన్నాథ్?
టాలీవుడ్ స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పీడ్ కొంతకాలంగా పూర్తిగా జీరోకి పడిపోయిన సంగతి తెలిసిందే.;

టాలీవుడ్ స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పీడ్ కొంతకాలంగా పూర్తిగా జీరోకి పడిపోయిన సంగతి తెలిసిందే. అతడు తెరకెక్కించిన `లైగర్` పాన్ ఇండియాలో డిజాస్టర్ కాగా, అంతకుముందు చాలా సినిమాల్ని రొటీన్ మాస్ ఎలిమెంట్స్తో తెరకెక్కించాడు పూరి. ఇంకా చెప్పాలంటే పూరి సినిమాల్లో అసలు కథే ఉండదన్న తీవ్ర విమర్శ ఉంది.

కొన్నిసార్లు తన దగ్గర పని చేస్తున్న రచయితల వల్లే తాను మోసపోతున్న విషయాన్ని గ్రహించి, వారిని మార్చేందుకు పూరి ప్రయత్నించాడు. బుర్రలోంచి ఇన్నోవేటివ్ ఐడియాలను తీసే వారికోసం వెతికాడు. నితిన్ `హార్ట్ ఎటాక్` సమయంలోనే పూరి నేరుగా జర్నలిస్టులతో మాట్లాడుతూ- నాకు మంచి కథలు రాసేవాళ్లు కావాలని కూడా అడిగారు. కారణం ఏదైనా పూరి కాంపౌండ్ లో సరైన రైటర్లు ఎవరూ లేరు అప్పటికి. దాని పర్యవసానం కూడా అతడు తెరకెక్కించిన చాలా సినిమాలపై పడింది. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ ఒక్కటీ రామ్ ఎనర్జీ, తెలంగాణ యాస, పూరి మార్క్ పంచ్ లతో విజయం సాధించింది.

అందుకే ఇప్పుడు పూరి జగన్నాథ్ నేరుగా వెటరన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ని కలవగానే, అభిమానుల్లో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. ఛార్మి సమేతుడై పూరి ఎందుకు అక్కడ విజయేంద్రుడిని కలిసినట్టు? అంటూ ఆరాలు తీస్తున్నారు. పూరి వాలకం చూస్తుంటే తన తదుపరి సినిమా స్క్రిప్టును మరింత మాడిఫికేషన్ చేయాలని కోరుతున్నారా? విజయ్ సేతుపతి అంత పెద్ద హీరోతో సినిమా తీస్తున్నాడు కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే అర్థమవుతోంది. అసలు విజయేంద్రుడితో భేటీ దేనికోసం అన్నది పూరి స్వయంగా వెల్లడిస్తాడేమో చూడాలి. ఇక రాజమౌళి కంటే పూరి వర్కింగ్ స్టైల్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పే విజయేంద్ర ప్రసాద్, తన అభిమాన దర్శకుడి కోసం ఏదైనా సహాయం చేస్తున్నారా? అన్నది వేచి చూడాలి.