జాన్వీ కొత్త మూవీ.. సౌత్ వాళ్ళకి నచ్చలేదా?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ భాషతో సంబంధం లేకుండా మంచి అవకాశాలు అందుకుంటున్నారు.;

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ భాషతో సంబంధం లేకుండా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు బీ టౌన్ స్టార్ హీరోతో కలిసి సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పరమ్ సుందరి మూవీ చేస్తున్నారు.
దాస్వి ఫేమ్ తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తుండగా.. మడాక్ ఫిల్మ్స్ పై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ ఇండియాకు చెందిన పరమ్ (సిద్ధార్థ్), సౌత్ ఇండియాకు చెందిన సుందరి (జాన్వీ) మధ్య ప్రేమకథగా సాగనున్న మూవీ జులై 25వ తేదీన రిలీజ్ కానుంది.
అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. రీసెంట్ గా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ స్టార్ట్ అవ్వగా.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. టీజర్ చివర్లో జాన్వీ కత్తితో కనిపించి షాక్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లో సోను నిగమ్ ఆలపించిన సాంగ్ హైలైట్ గా నిలిచింది.
కేరళలోని అందమైన బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్ ల నేపథ్యం మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డీసెంట్ గా బాగుందని అనేక మంది నెటిజన్లు కొనియాడారు. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యాక కొందరు సౌత్ మూవీ లవర్స్ మాత్రం సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలో జాన్వీ కపూర్ రోల్ డిజైన్ చేసిన తీరును విమర్శిస్తున్నారు. ఎప్పుడూ సౌత్ అమ్మాయిలను ఒకేలా చూపిస్తున్నారని అంటున్నారు. మీనాక్షి సుందరేశ్వర్, చెన్నై ఎక్స్ ప్రెస్ వంటి చిత్రాల్లో కూడా దక్షిణ భారత మహిళలను ఒకే విధంగా చిత్రీకరించారని, దీపికా పదుకొనే సాన్య మల్హోత్రా రోల్స్ ఒకే విధంగా ఉంటాయని చెబుతున్నారు.
సంస్కృతి గురించి కాదని, ప్రాతినిధ్యంలో వైవిధ్యం లేకపోవడం గురించి తమ బాధ అని చెబుతున్నారు. దక్షిణ భారత సంస్కృతి గొప్పది, వైవిధ్యమైనదని, అయినప్పటికీ సేమ్ క్యారెక్టరైజేషన్ ను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారని అంటున్నారు. మరోవైపు, కేవలం ఒక చిన్న టీజర్ తో కామెంట్ చేయొద్దని, మూవీ వచ్చాక చూడాలని చెబుతున్నారు. మొత్తానికి పరమ్ సుందరి మూవీ హాట్ టాపిక్ గా మారింది.