నాగవంశీ 'రిటర్న్ గిఫ్ట్'.. ఇప్పుడిదే హాట్ టాపిక్..
టాలీవుడ్ లో యంగ్ ప్రొడ్యూసర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు.;
టాలీవుడ్ లో యంగ్ ప్రొడ్యూసర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగవంశీ నిర్మించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు. రీసెంట్ గా సంక్రాంతికి కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. కంటెంట్ తో పాటు ఎమోషన్స్ తో కూడిన స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవల ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఆ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినిమా సక్సెస్ సాధించడంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన వేదికపై మాట్లాడారు. ఆ సమయంలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ, "గత 72 గంటలుగా మా ఫ్యాన్ బాయ్స్ సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా డ్యూటీ చేస్తున్నారు. నా ఫ్యాన్ బాయ్స్ అని ఎవరూ అనుకోకండి. ఎవరి ఫ్యాన్ బాయ్స్ అనేది మీ అందరికీ బాగా తెలుసు. వాళ్లందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెబుతున్నా. సినిమా కోసం నిరంతరం వర్క్ చేస్తూనే ఉన్నారు" అని నాగవంశీ తెలిపారు.
అదే సమయంలో ఫ్యాన్స్ కు మరో ఇంట్రెస్టింగ్ హామీ ఇచ్చారు. "ఇంకో వారం నుంచి పది రోజులు అలాగే సినిమాకి సపోర్ట్ చేయండి. అనగనగా ఒక రాజు సినిమా పెద్ద రెవెన్యూతో ఎండ్ ఇవ్వాలి. అలా జరిగితే, ఎలాంటి రేంజ్ లో, ఏ విధమైన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. దాని గురించి త్వరలోనే అనౌన్స్ చేస్తాం" అని తెలిపారు నాగవంశీ.
అయితే నాగవంశీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా గురించి ఫుల్ గా ప్రచారం జరుగుతుండగా, నిర్మాత కామెంట్స్ తో హడావుడి మరింత పెరిగింది. ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్ అనే పదం వినగానే ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అది మరో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటనా? లేక స్టార్ హీరోతో భారీ సినిమా అనౌన్స్మెంటా? అనే చర్చలు మొదలయ్యాయి.
మరోవైపు, అనగనగా ఒక రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ సినిమాను ఫుల్ గా ఆదరిస్తుండటంతో రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మౌత్ టాక్ బాగా పెరుగుతుండటంతో షోలు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా నాగవంశీ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ ఏంటన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో ఆ విషయంపై జోరుగా చర్చ సాగుతూనే ఉండనుంది.