దివంగత సుశాంత్ సింగ్ ఆత్మ ఘోషిస్తుందేమో!
బుల్లితెర రంగంలో తీవ్రమైన కాంపిటీషన్ ఉంది. ఈ పోటీని ఎదుర్కొని టీఆర్పీలను అందుకోవాల్సి ఉంటుంది.;
బుల్లితెర రంగంలో తీవ్రమైన కాంపిటీషన్ ఉంది. ఈ పోటీని ఎదుర్కొని టీఆర్పీలను అందుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక్కో చానెల్ ఒక్కో ఎత్తుగడను అనుసరిస్తున్నాయి. రియాలిటీ షోలు, సీరియళ్ల నిర్మాణంతో పాటు చాలా కార్యక్రమాలను రూపొందిస్తూ ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు పరిశ్రమలో మనుగడ సాగిస్తున్నాయి.
అయితే ఒకరి టైటిళ్లను ఒకరు కాపీ కొట్టడం అనేది చాలా అరుదు. ఇప్పుడు ఏక్తా కపూర్ షో పవిత్ర రిష్తా టైటిల్ ని జీటీవీ కాపీ కొట్టిందని ఆరోపించడం చర్చగా మారింది. త్వరలోనే లాంచ్ చేయనున్న ఒక కార్యక్రమానికి జీ టెలివిజన్ 'పవత్ర రిష్తా' అనే టైటిల్ ని ఎంచుకోవడంతో అది కాస్తా వివాదాస్పదమైంది. దీనిపై ఏక్తా కపూర్ బహిరంగంగా ఆరోపించారు.
ఒరిజినల్ పవిత్ర రిష్తా సీరియల్ లో అర్చనగా అంకితా లోఖండే, మానవ్ దేశ్ముఖ్ గా దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే అదే షో పేరును జీటీవీ ఉపయోగించుకోడాన్ని ఏక్తా తీవ్రంగా విమర్శించారు. బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్పై అసలైన సిరీస్ను నిర్మించిన ఏక్తా ఆర్ కపూర్, తమ టైటిల్ను తిరిగి ఉపయోగించినందుకు జీటీవీ ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''మీరు ఒక ఐపిని సృష్టించలేనప్పుడు, మరొక క్రియేటర్ సృష్టించిన ఐపిపై ఆధారపడతారు! ఇది భయంకరమైన నీతి లేదా మేధో దివాలా! లేదా రెండూ!! ఇందులో పవిత్రమైనది ఏమీ లేదు!!!'' అని అన్నారు.
ఏక్తా పోస్ట్ వేగంగా వైరల్ అయింది. ఒక విజయవంతమైన షో తాలూకా ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నంగా తాను భావిస్తున్నట్లు ఏక్తా వ్యంగ్యంగా అన్నారు. 2009లో మొదట ప్రసారమైన పవిత్ర రిష్తా మొదటిసారి టెలీకాస్ట్ అయింది.
జీ టీవీలో రానున్న కొత్త షో దీనికి భిన్నమైనది. కానీ టైటిల్ ని అదే ఉపయోగించడం విమర్శలకు తావిచ్చింది. 'యే హై చాహతే'లో తన నటనతో పాపులరైన అబ్రార్ ఖాజీ పాండ్యా స్టోర్, డోరీ వంటి షోలలో కథానాయికగా నటించిన ప్రియాన్షి యాదవ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ షోకు సిద్ధార్థ వంకర దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ షో ఫిబ్రవరి నుంచి టెలీకాస్ట్ కానుంది. ఈ టైటిల్పై తలెత్తిన వ్యతిరేకత ఇప్పటికే పరిశ్రమ వర్గాలలో .. ప్రేక్షకులలో చర్చకు దారితీసింది.