అవార్డులు వ్యాపారంగా మారాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

చలనచిత్ర రంగానికి సంబంధించిన అవార్డు వేడుకల విశ్వసనీయతపై తరచూ ఏదో ఓ వివాదం తలెత్తుతూనే ఉంది.

Update: 2026-05-22 13:30 GMT

చలనచిత్ర రంగానికి సంబంధించిన అవార్డు వేడుకల విశ్వసనీయతపై తరచూ ఏదో ఓ వివాదం తలెత్తుతూనే ఉంది. ప్రతిభకు గుర్తింపుగా ఇవ్వాల్సిన పురస్కారాలు వ్యాపార దృక్పథంతో కూడిన షోలుగా మారిపోయాయనే విమర్శలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, `మిర్జాపూర్` సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. నేటి కాలంలో అవార్డు ఫంక్షన్లు పెద్ద జోక్‌గా మారిపోయాయని అభివర్ణించడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు అవార్డు వేడుకలంటే చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారన్నారు.

ఒక నటుడికి లేదా సాంకేతిక నిపుణుడికి అవార్డు వస్తే అది వారి కష్టానికి దక్కిన నిజమైన గౌరవంగా చూసేవారని దివ్యేందు గుర్తుచేశారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న అవార్డు షోలకు, అసలైన సినిమా రంగానికి అసలు ఎలాంటి సంబంధం లేదని అవన్నీ కేవలం ఒక నిర్దేశిత స్క్రిప్ట్ ప్రకారం సాగే వినోద కార్యక్రమాల్లా తయారయ్యాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఫంక్షన్లు ఇప్పుడు ఛానళ్లకు టీఆర్‌పీ రేటింగులు పెంచుకోవడానికి, అలాగే కార్పొరేట్ కంపెనీలకు భారీగా డబ్బు సంపాదించి పెట్టే వ్యాపార వనరులుగా మారిపోయాయని దివ్యేందు స్పష్టం చేశారు.

వేదికపై ఏ నటుడు ఏ డైలాగ్ చెప్పాలి, ఎవరు ఏ అవార్డు అందుకోవాలి అనేది ముందే నిర్ణయించబడుతోందని, అందువల్ల అక్కడ ప్రతిభకు దక్కే స్థానం చాలా తక్కువని విమర్శించారు. కేవలం గ్లామర్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లతో షోను రక్తికట్టించడమే నిర్వాహకుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. సినిమా రంగంలో నిజాయితీగా శ్రమించే ఎంతో మంది ప్రతిభావంతులు ఈ తరహా పక్షపాత వైఖరి వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. అర్హత గల చిత్రాలను, అద్భుతమైన నటనను ప్రదర్శించిన నటీనటులను పక్కనపెట్టి పాపులారిటీ లేదా స్టార్ స్టేటస్ ఉన్నవారికే అవార్డులు కట్టబెట్టడం సరికాదని హితవు పలికారు.

ఆ కారణం చేతనే తాను వ్యక్తిగతంగా ఇలాంటి అవార్డు వేడుకలకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తానని అక్కడ సమయాన్ని వృథా చేసుకోవడం కంటే తన పనిపై దృష్టి పెట్టడం మిన్న అని తేల్చి చెప్పారు.

దివ్యేందు విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కమర్షి యల్ సినిమాలకే పరిమితం కా కుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో బలమైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన హిందీతో పాటు పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు కావడంతో దివ్యేందు చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలోని అంతర్గత వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

దివ్యేందు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సామాన్య ప్రేక్షకులు కూడా ఈ మధ్య కాలంలో అవార్డు షోల పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి ఇవే కారణాలని నెటిజన్లు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా వేడుకల నిర్వాహకులు కమర్షియల్ యాంగిల్స్ పక్కనపెట్టి నిజమైన క్రియేటివిటీని గౌరవించేలా విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంద‌ని పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News