వేట్రిమారన్ మాస్టర్ ప్లాన్.. ధనుష్, శింబును కలిపేస్తున్నాడా?
అఫీషియల్ గా ఎప్పుడూ ఎవరూ దీనిపై స్పందించకపోయినా, కోలీవుడ్ వర్గాల్లో ఈ అంశం తరచూ చర్చకు వస్తూనే ఉంటుంది.
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా చర్చకు దారి తీస్తున్న ధనుష్ - శింబు ఈక్వేషన్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ఇద్దరూ యంగ్ స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని శాసించిన ఈ నటులు పలు సందర్భాల్లో స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ, వారి మధ్య అంతా సవ్యంగానే ఉందా అనే సందేహాలు మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో శింబు ప్రేమలో ఉన్నారనే వార్తలు గతంలో వచ్చిన తర్వాత, ఆమె ధనుష్ను పెళ్లి చేసుకోవడం ఈ ఇద్దరి మధ్య దూరానికి కారణమైందనే ప్రచారం చాలాకాలంగా కొనసాగుతోంది. అఫీషియల్ గా ఎప్పుడూ ఎవరూ దీనిపై స్పందించకపోయినా, కోలీవుడ్ వర్గాల్లో ఈ అంశం తరచూ చర్చకు వస్తూనే ఉంటుంది.
ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను ఒకే సినిమాతో మళ్లీ కలిపే ప్రయత్నం జరుగుతోందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రస్తుతం శింబు హీరోగా తెరకెక్కిస్తున్న అరసన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తన కల్ట్ క్లాసిక్ వడ చెన్నై యూనివర్స్లోనే సాగుతుందని, కథాపరంగా ఆ ప్రపంచానికి అనుసంధానంగా ఉంటుందని కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇదే నేపథ్యంలో వడ చెన్నైలో ప్రధాన పాత్ర పోషించిన ధనుష్ను సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ కోసం సంప్రదించారనే వార్తలు బయటకు వచ్చాయి. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ క్యామియో పాత్ర కథకు కీలకంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా, వేట్రిమారన్ కోసం ధనుష్ ఈ రోల్ చేయడానికి సిద్ధమవుతున్నారనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ధనుష్, వేట్రిమారన్ కాంబినేషన్కు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. పొల్లాధవన్, ఆడుకలం, అసురన్, వడ చెన్నై వంటి సినిమాలు వీరి కాంబినేషన్ కు అపారమైన క్రేజ్ తీసుకొచ్చాయి. అలాంటి డైరెక్టర్ అడిగితే, పర్సనల్ రీజన్స్ కు పక్కన పెట్టి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, ధనుష్, శింబు ఒకే సినిమాలో కనిపించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా మారవచ్చు.
ఇక ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమ పరిస్థితులు కూడా కొత్త ప్రయోగాలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు కమర్షియల్ ఫార్ములాతో వరుస సక్సెస్లు సాధించిన పలువురు స్టార్ హీరోలు ఇప్పుడు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతున్నారు. మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ప్రతిసారీ ప్రేక్షకుల ఆదరణ పొందడం లేదు. దీంతో డైరెక్టర్లు, హీరోలు కొత్త కాంబినేషన్లు, విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరసన్ వంటి ప్రాజెక్ట్పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ మొత్తం డిస్కషన్ కు ఫుల్స్టాప్ పడాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ధనుష్ నిజంగానే శింబు సినిమాలో క్యామియో చేస్తారా? లేక ఇది కేవలం ప్రచారమేనా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు కోలీవుడ్లో ఈ వార్త హాట్ టాపిక్గా కొనసాగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.