టాలీవుడ్ లో ఖరీదైన ఫ్లాప్ మూవీస్ ఇవే!
ఒకప్పుడు రూ.50 కోట్లు అంటేనే గొప్ప, కానీ ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్తో నిర్మాతలు రూ.500 కోట్లు పెట్టడానికైనా వెనుకాడటం లేదు.;
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. ఒకప్పుడు రూ.50 కోట్లు అంటేనే గొప్ప, కానీ ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్తో నిర్మాతలు రూ.500 కోట్లు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. అయితే, భారీ బడ్జెట్ ఉన్నంత మాత్రాన విజయం వస్తుందని గ్యారంటీ లేదు. కొన్ని సినిమాలు వందల కోట్ల బడ్జెట్తో వచ్చి, బాక్సాఫీస్ వద్ద చతికిలపడి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. అంచనాలు మిస్సయ్యి, భారీ నష్టాలు తెచ్చిన ఆ ఖరీదైన ఫ్లాప్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆదిపురుష్: అంచనాలు భారీ.. ఫలితం నిరాశ:
ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన 'ఆదిపురుష్' భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రామాయణ గాథ ఆధారంగా దాదాపు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్తో దీనిని నిర్మించారు. కానీ, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 390 కోట్ల వసూళ్ల దగ్గరే ఆగిపోయి, ట్రేడ్ పరంగా భారీ నష్టాలను చవిచూసింది.
లైగర్ , గేమ్ ఛేంజర్ - పాన్ ఇండియా దెబ్బ:
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్'పై భారీ అంచనాలు ఉండేవి. సుమారు రూ. 125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 60 కోట్ల గ్రాస్తో డిజాస్టర్గా నిలిచింది. అలాగే ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'గేమ్ ఛేంజర్' కూడా దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్తో రూపొందింది. పాటలకే రూ. 75 కోట్లు ఖర్చు చేసినా, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 186 కోట్ల వసూళ్లే సాధించడంతో 2025లో అతిపెద్ద ఫ్లాప్లలో ఒకటిగా మిగిలిపోయింది.
ఏజెంట్: అఖిల్ ఆశలపై నీళ్లు:
ఇక అఖిల్ అక్కినేని తన లుక్ మార్చుకుని, భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో చేసిన సినిమా 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ను దాదాపు రూ. 80 - 85 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. షూటింగ్ ఆలస్యం కావడం, కథలో స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 13 కోట్లు మాత్రమే వసూలు చేసి, అఖిల్ కెరీర్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా ఒక పెద్ద కమర్షియల్ డిజాస్టర్గా మిగిలిపోయింది.
కంటెంట్ ఉంటేనే కాసులు:
భారీ బడ్జెట్, స్టార్ హీరో, క్రేజీ డైరెక్టర్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అవ్వదని ఈ ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. సినిమా కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడం కంటే, ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే బలమైన కథ ఉండటమే ముఖ్యమని అర్థమవుతోంది. ఇక బాహుబలి, పుష్ప వంటి సినిమాలు బడ్జెట్ ను మించి వసూళ్లను రాబట్టాయి కానీ, పైన చెప్పుకున్న చిత్రాలు మాత్రం కేవలం హంగులకే ప్రాధాన్యత ఇచ్చి కథను విస్మరించడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. నిర్మాతలకు ఇవి ఒక గుణపాఠం లాంటివి.