అప్పుడు.. ఇప్పుడు.. జీ5 ప్లాట్ ఫామ్ అండగా.. : భరత్
పంచనామా మొత్తం ఆరు ఎపిసోడ్లుగా తెరకెక్కింది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ ఎలిమెంట్స్ కలిపి రూపొందించిన ఆ సిరీస్ ఉత్కంఠగా సాగనుంది.
ప్రేమిస్తే, బాయ్స్, చంద్రముఖి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ యాక్టర్ భరత్ శ్రీనివాసన్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటించిన కొత్త తెలుగు వెబ్ సిరీస్ పంచనామా. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఆ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో భరత్ తన కెరీర్ లో జీ5తో ఉన్న రిలేషన్ ను గుర్తు చేసుకున్నారు.
జీ ప్లాట్ ఫామ్ తన కెరీర్ జర్నీలో ఒక ముఖ్యమైన భాగమని భరత్ తెలిపారు. తన తొలి సినిమా కాళిదాసు 2019లో తమిళనాడులో మంచి విజయాన్ని అందుకుందని చెప్పారు. సినిమా విడుదలకు ముందే జీ ప్లాట్ ఫామ్ ఆ చిత్రాన్ని చూసి, ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని గుర్తు చేసుకున్నారు.
"సినిమా రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ రావడం అప్పట్లో అంత ఈజీ కాదు. కానీ జీ నా సినిమా చూసి నచ్చడంతో ముందుగానే హక్కులు తీసుకుంది. అప్పటి నుంచే నా కెరీర్ గ్రోత్ కూడా మొదలైంది. ఇప్పుడు పంచనామా వెబ్ సిరీస్ కు కూడా జీ5 అండగా నిలిచింది" అని భరత్ అన్నారు. పంచనామాలో భరత్ జై రామ్ అనే నిజాయితీగల, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. విధి నిర్వహణలో చివరి రెండు రోజులు మాత్రమే ఉన్న సమయంలో ఆయనకు కొన్ని అనుమానాస్పద మరణాల కేసులు ఎదురవుతాయి.
మొదట ప్రమాదాలుగా కనిపించిన ఆ మరణాల వెనుక అసలు కారణం ఏంటి? వాటి వెనుక ఉన్న కుట్ర ఏమిటి? అనే విషయాలను జై రామ్ ఎలా బయటకు తీశాడనేది సిరీస్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించనున్నారు. మూడు అనుమానాస్పద మరణాల చుట్టూ కథ తిరుగుతుంది. వాటి వెనుక ఉన్న మెడికల్ సిండికేట్, రాజకీయ అవినీతి వంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు. ఒక్కో ఎపిసోడ్ లో కొత్త విషయాలు బయటపడేలా కథను రూపొందించినట్లు తెలుస్తోంది.
పంచనామా మొత్తం ఆరు ఎపిసోడ్లుగా తెరకెక్కింది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ ఎలిమెంట్స్ కలిపి రూపొందించిన ఆ సిరీస్ ఉత్కంఠగా సాగనుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా.. ఉదయ భాను ప్రొడక్షన్స్ బ్యానర్ పై మిడ్డే విజయేంద్ర మౌళి, ఉదయ భాను సంయుక్తంగా నిర్మించారు. ఆ సిరీస్ లో భరత్తో పాటు సీనియర్ నటుడు శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాధిక ప్రీతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో పంచనామా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే క్రైమ్ థ్రిల్లర్ కథలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ లభిస్తుండటంతో.. ఆ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.