విలన్ల పాలిట మహా విలన్ గా మారిన కరోనా!

Update: 2020-04-13 11:33 GMT
టాలీవుడ్ హీరోలు మాత్రమే తెలుగు వారు ఉంటారు. ఇక మిగతావారు  ఏ భాష అయినా ఫరవాలేదు.  హీరోయిన్లు.. విలన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు.. దర్శకులు ..ఇతర టెక్నీషియన్లు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు  చాలా పెద్దది అవుతుంది.  విలన్ల విషయమే తీసుకుంటే టాలీవుడ్ మేకర్లు ఎక్కువగా బాలీవుడ్ నటీనటులను ప్రతినాయక పాత్రలకు ఎంచుకుంటూ ఉంటారు. ఒకవేళ బాలీవుడ్ నటులు కాకపోతే తమిళ.. మలయాళ నటులను ఎంచుకుంటారు. జగపతి బాబు లాంటి వారు కూడా టాలీవుడ్ లో ఉన్నారు కానీ ఇలాంటి వారు చాలా తక్కువమంది. టాలీవుడ్ లోనే కాదు ఇతర సౌత్ భాషలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.  అయితే తాజాగా కరోనా ఎఫెక్ట్ ఈ  విలన్లపై కూడా పడిందని టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే ఈ విలన్ పాత్రలు పోషించే వారికి కోట్ల రూపాయలు ముట్టజెప్పాల్సి వస్తోందట. ఇప్పటికే  థియేటర్ల మూత.. ఇతర సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ కారణంగా ఫ్యూచర్లో సినిమాల బడ్జెట్ లు కుదించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. స్టార్ హీరోల పారితోషికాల విషయంలో కూడా పరిమితి విధించాలని చర్చలు సాగుతున్నాయట.  స్టార్ హీరోల పరిస్థితే అలా ఉంటే ఇక విలన్ పాత్రలకు అధిక పారితోషికం ఇవ్వడం అనేది మర్చి పోవాలి.  విలన్ పాత్రలు పోషించే నటులకు ఇప్పటి వరకూ కోట్ల రూపాయలు ముట్టజెపుతున్నారట.

మన జగపతిబాబు ఓ సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకుంటారట. ఇక జాకీ ష్రాఫ్ ఓ సినిమాకు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారట.  తమిళ హీరో విజయ్ సేతుపతి ఈమధ్య టాలీవుడ్ లో విలన్ పాత్రలు టేకప్ చేస్తున్నారు.. ఆయన పారితోషికం కూడా భారీగానే ఉంటుందని సమాచారం.  ఇప్పటికే ఇలాంటి విలన్లను లాక్ చేసుకున్న నిర్మాణ సంస్థలు పారితోషికం తగ్గించుకోవాలని ఈ నటులతో  తాజాగా బేరాలాడుతున్నాయట. తగ్గించిన రెమ్యూనరేషన్ తో రీ-ఎగ్రిమెంట్లు చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయట. మరోవైపు కొత్తగా సెట్ చేసుకునే  విలన్లకు పారితోషికంలో కోత విధించాలని నిర్ణయం తీసుకుంటున్నారట.  అంటే ఈ మహమ్మారి కరోనా విలన్ల పాలిట మహా విలన్ గా మారిందన్నమాట!
Tags:    

Similar News