‘మహానటి’లో ఆ స్టార్ రైటర్ కూడా..

Update: 2017-10-23 10:29 GMT
అలనాటి నటి సావిత్రి జీవిత కథతో సినిమా అనగానే ఇది జనాలకు ఏమాత్రం ఆసక్తి రేకెత్తిస్తుందో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైజయంతీ మూవీస్.. నటీనటుల ఎంపికతో జనాల్లో బాగానే ఆసక్తి తీసుకురాగలిగింది. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్.. సినిమాలో మరో కీలక పాత్రకు సమంతను ఎంచుకోవడంతో జనాల్లో క్యూరియాసిటీ మొదలైంది. ఇక జెమిని గణేశన్ పాత్రకు దుల్కర్ సల్మాన్ ను.. ఎస్వీ రంగారావు పాత్రకు మోహన్ బాబును.. నాగిరెడ్డి పాత్రకు ప్రకాష్ రాజ్ ను.. ఇలా మంచి నటులుగా పేరున్న వాళ్లను కీలక పాత్రలకు ఎంచుకోవడం కూడా ఆసక్తి రేకెత్తించింది.

కె.వి.రెడ్డిగా క్రిష్.. సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్ నటిస్తున్నారన్న సమాచారమూ జనాల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా కోసం మరో ఆసక్తికర ఎంపిక గురించి సమాచారం బయటికి వచ్చింది. అలనాటి దిగ్గజ రచయిత పింగళి పాత్రలో స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా కనిపించబోతున్నాడట. మొత్తంగా నాగ్ అశ్విన్ అండ్ టీం కీలక పాత్రలకు ఎంచుకుంటున్న వ్యక్తుల ప్రొఫైల్స్ జనాల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాయి. అశ్వినీదత్ బేనర్ మీదున్న గౌరవంతో చాలామంది పారితోషకాలు లేకుండా క్యామియోలు చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు కూడా రాస్తుండటం విశేషం. ఆ సందర్భంలోనే పింగళి పాత్ర చేయాలన్న ప్రతిపాదన రావడం.. ఆయన అంగీకరించడం జరిగాయి.
Tags:    

Similar News