జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో రికార్డు చేరింది. సినీ నటుడిగా కెరీర్ ప్రారంభించి పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్న పవన్ అనంతరం తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత తనే సొంతంగా ప్రజల తరఫున ప్రశ్నించేందుకు అంటూ జనసేనను ప్రారంభించారు. పార్టీ పెట్టిన తరువాత ఇటు సినిమాలు అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకోవడానికి సినీనటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా పాలిటిక్స్ - సినిమా - అభిమానులు..వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్న క్రమంలోనే ఆయనకు మరో రికార్డు దక్కింది. పవన్ క్షేత్రస్థాయి కంటే ట్విట్టర్ ద్వారానే అభిమానులకు - పార్టీ శ్రేణులకు ఆయన అందుబాటులో ఉంటున్నారు. శుభాకాంక్షలు తెలపాలన్నా - ఏ విషయాన్నయినా విమర్శించాలన్నా - ఉద్యమానికి పిలుపునివ్వాలన్నా ఆయన ట్విట్టర్ నే వేదికగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా ట్విట్టర్ లో పవన్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 20 లక్షల మందికి చేరింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారానే పవన్ తెలపడం విశేషం. పార్టీ కార్యక్రమాలు రాబోయే కాలంలో మరింత పెంచనున్నారని వార్తల నేపథ్యంలో జనసేనాని ఫాలోవర్ల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.