నాటు నాటు మా పాట కాదు.. మనందరి పాట!

Update: 2023-03-17 18:21 GMT
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ దక్కించుకోవడంతో సినిమాకి, సినిమాలో భాగమైన అందరికీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కేలా చేసింది. ఇక అమెరికాలో పార్టీలు పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్లు ఇప్పటికే హైదరాబాదులో ల్యాండ్ అయిపోయారు.

ఇక ఈరోజు ఉదయం రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న కాన్ క్లేవ్లో ప్రధానమంత్రి మోడీతో కలిసి రామ్ చరణ్ తేజ్ పాల్గొనబోతున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ సహా ఆయన భార్య ఉపాసనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు భారతీయ సినిమాకి ఆస్కార్ రావడంతో అక్కడ ఉన్న భారతీయులందరూ ఆస్కార్ అవార్డుల వేడుక నుంచి నేరుగా ఢిల్లీ వచ్చిన రామ్ చరణ్ దంపతులకు స్వాగతం పలికారు.

ఒకానొక సమయంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు అక్కడికి వచ్చిన జనాలను చూసి కాస్త ఇబ్బందిగా కూడా ఫీలయ్యారు. అయితే భార్య ఉపాసన గర్భవతి కావడంతో చాలా జాగ్రత్తగా రామ్ చరణ్ ఆమెను కారులోకి ఎక్కించారు. ఇక ఎయిర్ పోర్టు నుంచి తాను విడిది చేయబోయే హోటల్ కి వెళ్ళబోయే ముందు రామ్ చరణ్ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు.

ఇక మీడియా ప్రతినిధులందరూ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ హిందీలోనే సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇక నాటు నాటు అనేది తమ పాట కాదని తమ సినిమాలో పాట కాదని.. నాటు నాటు అనేది మన భారతదేశానికి చెందిన పాట అని పేర్కొన్నారు . కేవలం భారత దేశ ప్రజలందరి ప్రేమ ఆప్యాయతల వల్లే ఆ పాటను ఆస్కార్ వరకు తీసుకువెళ్లాయని ఆస్కార్ అవార్డు తీసుకువచ్చే ప్రోత్సాహం ఇచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు రేపు జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్లో రామ్ చరణ్ తేజ్ పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ కూడా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News