బాలీవుడ్ తెరపై జగపతిబాబు విలనిజం!

Update: 2021-10-21 09:31 GMT
సాధారణంగా హీరోలలో చాలామంది తమ కెరియర్లో ముందుగా విలన్ పాత్రలు చేసినవారే. ఆ తరువాత సమయం .. సందర్భం చూసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాలం కలిసొచ్చినవారు హీరోగానే కంటిన్యూ అయ్యారు. అయితే టాలీవుడ్ కి సంబంధించి ఒకరి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది .. ఆయన పేరే జగపతిబాబు. అవును జగపతిబాబు హీరోగా .. అందునా ద్విపాత్రాభినయంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆడకపోయినా ఆయనను మాత్రం ఆపలేకపోయింది. ఫ్యామిలీ హీరోగా ఆయన తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగారు.

ఒకానొక దశలో జగపతిబాబు ఇద్దరు హీరోయిన్ల సినిమాలను ఎక్కువగా చేస్తూ .. విజయాలను అందుకుంటూ, మరో శోభన్ బాబు అనుకునే పరిస్థితిని కూడా తీసుకొచ్చాడు. కానీ ఎందుకో మళ్లీ ఆయన ఆ ట్రాక్ నుంచి బయటికి వచ్చాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ ను ఆయన తెరపై గొప్పగా పండించాడు. ఆ తరువాత వరుస పరాజయాల కారణంగా ఆయనకి కూడా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన విలన్ పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో 'లెజెండ్' సినిమాలో విలన్ పాత్ర కోసం ఆయనను బోయపాటి సంప్రదించడంతో తాను అనుకున్నట్టుగానే జరిగింది.

హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు స్టార్ హీరో అనిపించుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ విలన్ పాత్రల విషయంలో ఆయన అంత సమయం తీసుకోలేదు. చాలా తక్కువ కాలంలోనే ఆయన స్టార్ విలన్స్ జాబితాలో చేరిపోయాడు. ఆయన కళ్లు .. వాయిస్ విలన్ పాత్రల్లో ఆయన రాణించడంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. ఇప్పుడు ఆయన టాలీవుడ్ విలన్స్ లో టాప్ పొజీషన్లో ఉన్నాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను విలన్ గా చేస్తున్నాడు.

ఇక త్వరలో ఆయన బాలీవుడ్ తెరపై భారీ స్థాయిలో విలనిజాన్ని ప్రదర్శించనున్నాడు. హిందీలో అశుతోష్ గోవారికర్ 'పుకార్' అనే ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా రకుల్ కనిపించనుంది. ఈ సినిమాలో ఫర్హాన్ ఫారెస్టు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అటవీ సంపదను కాపాడుకోవాలనే నిజాయితీగల అధికారి పాత్రను ఆయన పోషించనున్నాడు. ఆయన ఆశయానికి అడ్డుపడే ప్రతినాయకుడి పాత్ర కోసమే జగపతిబాబును తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. మొత్తానికి జగపతిబాబు విలనిజం బాలీవుడ్ తెరపై విశ్వరూపం చూపనుందన్న మాట.



Tags:    

Similar News