శర్వా సినిమాలో ఆ షాకేంటో?

Update: 2018-12-15 01:30 GMT
క్రిస్మస్ వీకెండ్లో రాబోతున్న ఆసక్తికర చిత్రాల్లో ‘పడి పడి లేచె మనసు’ ఒకటి. ‘అందాల రాక్షసి’.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’.. ‘లై’ లాంటి వెరైటీ సినిమాలు తీసిన హను రాఘవపూడి రూపొందించిన చిత్రమిది. శర్వానంద్-సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ప్రతి ప్రోమోలోనూ శర్వా సాయిపల్లవి వెంట తిరగడమే కనిపించింది. ఇద్దరి మధ్య గిల్లి కజ్జాల నేపథ్యంలోనే సినిమా సాగడేలా కనిపించింది. ఐతే ఈ గిల్లికజ్జాలతోనే పూర్తి సినిమా నడిపించడమంటే కష్టం కదా? అంతకుమించిన కంటెంట్ ఏదో సినిమాలో ఉండాలి కదా? ఐతే ఆ యాంగిల్ ఏంటన్నది ఇప్పటిదాకా ఏ ప్రోమోలో చూపించలేదు. దాన్ని సస్పెన్స్‌ లాగా దాచి పెడుతున్నారు.

చిత్ర బృందం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘పడి పడి లేచె మనసు’ ప్రథమార్ధమంతా సరదాగా సాగిపోతుందట. కానీ ద్వితీయార్ధంలో షాకింగ్ అంశాలు ఉంటాయట. ఇప్పటి దాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని విషయం ఒకటి ద్వితీయార్ధంలో ఉందని అంటున్నారు. ఇలాంటి ప్రేమకథ లో అంత షాకింగ్ విషయం ఏమై ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఐతే హను రాఘవపూడికి ప్రథమార్ధాన్ని బాగా నడిపించి.. ద్వితీయార్ధంలో తేలిపోయే బలహీనత ఉంది.

అతడి తొలి మూడు సినిమాల్లోనూ ఈ బలహీనత కనిపిస్తుంది. అందుకే అతను ఆశించిన స్థాయిలో పెద్ద సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రథమార్ధాన్ని సరదాగా నడిపించి.. ద్వితీయార్ధాన్ని ఇంటెన్స్‌ గా నడిపించే క్రమంలో తడబడుతుంటాడు. మరి ‘పడి పడి లేచె మనసు’ ప్రోమోలు చూస్తే ప్రథమార్ధంలో చాలా సరదాగా. రొమాంటిగ్గా సాగుతూ ఈజీగా టైంపాస్ అయ్యేలా ఉంది. మరి ద్వితీయార్దంలో అతడిచ్చే షాకుల్ని జనాలు తట్టుకుంటారా? అది ఏమేరకు జనాల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News