రాజమౌళితో బాలీవుడ్ హీరోయిన్సా?

Update: 2017-12-13 16:56 GMT
బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి కథను ఎంచుకుంటాడా అని ప్రతి ఒక్కరిలో ఎంతో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కానీ జక్కన్న అభిమానులు ఎప్పటినుంచొ కోరుకుంటున్న ఒక భారీ బడ్జెట్ మల్టీస్టారర్ కి టెండర్ వేశాడు. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించబోతోన్న ఆ సినిమా కథ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. బాలీవుడ్ సినీ జనాలు కూడా బాహుబలి డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏమిటని చర్చించుకుంటున్నారు.

ఒకవేళ సినిమాను తీస్తే కేవలం తెలుగులోనే తీస్తాడా లేక బాహుబలి లాగా డబ్ చేస్తాడా అని నార్త్ మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. సినిమాను 150 కోట్లతో తీస్తున్నారు కాబట్టి తప్పకుండా డబ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించింది కాదు కాబట్టి తారలే ప్రధానంగా కనిపించాలి. దీంతో హీరోల సరసన రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. నిజానికి కొన్ని రోజుల క్రితం సినిమాలో ఎన్టీఆర్ సరసన అను ఇమ్మాన్యుయేల్ ని ఫైనల్ చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి కానీ ఇప్పుడు జక్కన్న మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులు కూడా అదే చెబుతున్నట్లు టాక్.

బాహుబలి తో వచ్చిన ఇమేజ్ ను ఏ మాత్రం పోగొట్టుకోవద్దని సినిమాలో యాక్షన్ సీన్స్ ని నార్త్ జనాలు తప్పకుండా ఇష్టపడతారని కుటుంబ సభ్యులు సలహాలు కూడా ఇస్తున్నారట. రాజమౌళి కూడా అందుకు సానుకూలంగా స్పందించనట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News