ప్లాప్ ల్లోనూ దూసుకుపోతున్న బ్యూటీ!
`లైగర్` తో టాలీవుడ్ ని ఏలాలని అనన్యా పాండే లాంచ్ అయింది. కానీ అందుకు భిన్నమైన సన్నివేశం ఇక్కడ ఎదురైంది.;
`లైగర్` తో టాలీవుడ్ ని ఏలాలని అనన్యా పాండే లాంచ్ అయింది. కానీ అందుకు భిన్నమైన సన్నివేశం ఇక్కడ ఎదురైంది. అన్నీ తాను అనుకున్నట్లు జరిగితే? పైన గాడ్ ఎందుకు అన్నట్లు? `లైగర్` డిజాస్టర్ అయింది. దీంతో అమ్మడు టాలీవుడ్ లో సినిమాలు చేయనంటూ బాలీవుడ్ కి వెళ్లిపోయింది. వెళ్లిన కొన్ని నెలలకు తెలుగులో ఓ చెత్త సినిమాలో నటించి పెద్ద తప్పు చేసానంటూ కామెంట్ చేసి వెళ్లింది. కెరీర్ లో అదే చివరి తప్పు అవ్వాలని ..మరో తప్పు చేయని నటిగా తనని తాను ప్రోజక్ట్ చేసుకుంది. `లైగర్` ప్లాప్ తర్వాత వెయిట్ చేయలేదు.
సొంత పరిశ్రమ ముంబై ఉంది కదా? అన్న ధీమాతో వెళ్లిపోయింది. అనుకున్నట్లుగానే అమ్మడు ఆరంభంలో అక్కడ బాగానే సక్సెస్ అయింది. `రాకీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ` లో స్పెషల్ సాంగ్ తో అలరించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత హీరోయిన్ గా నటించిన `డ్రీమ్ గర్ల్ 2` తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. `కహో గయే హమ్ కహానా`లో నటించింది. ఈ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. అటుపై రిలీజ్ అయిన `బ్యాడ్ న్యూజ్` లో స్పెషల్ సాంగ్ తో కుర్రాళ్లను అలరించింది. అటు పై `సీటీఆర్ ఎల్` తో మరో ప్లాప్ ను ఖాతాలో వేసుకుంది.
అనంతరం `కేసరి చాప్టర్ 2` తో మరో డిజాస్టర్ అందుకుంది. ఇటీవలే `తూ మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తూ మేరీ` చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అందులో సగం బడ్జెట్ ను రికవరీ చేయలేకపోయింది. కానీ అనన్య లైనప్ మాత్రం స్ట్రాంగ్ గా ఉందన్నది లేటెస్ట్ అప్ డేట్. ఈ ప్లాప్ తో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్ట్ లు ఒడిసి పట్టుకుంటుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం `చాంద్ మేరా దిల్`లో నటిస్తోంది. ఈ చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది.
రిలీజ్ కు ముందే మరో మూడు ప్రాజెక్ట్ లకు సైన్ చేసిందని సమాచారం.మడూక్ బ్యానర్ లో ఓ చిత్రం...ధర్మ ప్రొడక్షన్స్ లో ఓ చిత్రం , టీ సిరీస్ -బిఆర్ స్టూడియోస్ లో మరో రెండు చిత్రాలకు అగ్రిమెంట్ చేసుకుందని ప్రచారం జరుగుతోంది. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్లాప్ చిత్రాల తర్వాత వరుస అవకాశాలు అందుకోవడం అనన్యకే చెల్లిందంటూ నెట్టింట నెటి జనుల కామెంట్లు అంతే ఆసక్తికరం.